ఏపీలోని అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. పొత్తులో భాగంగా టీడీపీకీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు వచ్చాయి. వీటన్నింటికీ అభ్యర్థులను ప్రకటించేసింది తెలుగుదేశం పార్టీ. టికెట్ కన్ఫామ్ చేసుకున్న అభ్యర్థులు ప్రచారాన్ని పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. అయితే టీడీపీ అభ్యర్థుల్లో మార్పులు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. పెద్దగా మార్పులు ఉండకపోయినా.. ఆ ఒక్క ఎంపీ సీటులో మాత్రం మారుస్తారని వార్తలు వస్తున్నాయి. అదే ఏలూరు ఎంపీ సీటు. ఏలూరు ఎంపీ సీటును బీజేపికి ఇచ్చి.. బీజేపీకి కేటాయించిన నరసాపురం ఎంపీ సీటును తీసుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
పొత్తులో భాగంగా టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అయితే పొత్తులో భాగంగా తమకు వచ్చిన ఆరు ఎంపీ సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. కానీ ఊహించని విధంగా నరసాపురం ఎంపీ సీటును సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకు కాకుండా పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేటాయించారు. అయితే వైసీపీ నుంచి గెలిచి కూడా.. ఆ పార్టీపై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న రఘురామకు టికెట్ వస్తుందని రాజకీయవర్గాలతో పాటు టీడీపీ నేతలు కూడా ఆశించారు. బీజేపీ, టీడీపీలలో ఏదో ఒక పార్టీ నుంచి ఆయన నరసాపురం బరిలో ఉంటారని అనుకున్నారు. కానీ కమలం పార్టీ పెద్దల ట్విస్టుతో నరసాపురం రాజకీయం మారిపోయింది.
ఈ నేపథ్యంలో రఘురామరాజును ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తోందట. అందుకోసమే ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చి.. బదులుగా నరసాపురం సీటు తీసుకోవాలని భావిస్తున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టే విధంగా రఘురామకృష్ణరాజు ఢిల్లీలో అనేక ప్రయత్నాలు చేశారని.. అందుకే ఆయనకు ఎలాగైనా టికెట్ ఇవ్వాలని రెండు పార్టీలపై కొంచెం ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏలూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరుఫున యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్కు అవకాశం కల్పించారు. నరసాపురం ఎంపీ సీటు టీడీపీ తీసుకుంటే.. ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీకి వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు బీజేపీ తరుఫున గారపాటి తపన చౌదరి ఏలూరు ఎంపీగా పోటీచేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరి దీనిపై రెండు పార్టీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు ఇంకా 15 రోజుల వరకూ సమయం ఉన్నందున.. ఆలోపే ఏమైనా జరగవచ్చు మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa