ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీలో ఉండి టికెట్ లొల్లి.. రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 06:28 PM

టీడీపీలో ఉండి టికెట్ వ్యవహారం కాకరేపుతోంది. టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి. నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామను ఈసారి అసెంబ్లీ బరిలో నిలుపుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉండిలో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఉండి టికెట్‌ను ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్ఫార్మ్ చేశారు. తొలి విడతలోనే ఆయనకు టికెట్ కేటాయించారు. రామరాజు సైతం ప్రచారం ప్రారంభించారు. అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరటంతో ఆయనకు ఉండి టికెట్ కేటాయిస్తారనే వార్తలు వచ్చాయి. దీంతో రామరాజు మద్దతుదారులు శనివారం ఉండిలో నిరసనలు తెలియజేశారు.


ఈ క్రమంలోనే ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణరాజు ఉండి టికెట్ వ్యవహారంపై స్పందించారు. "ఉండి సీటు నీకు అని చంద్రబాబు నాకు చెప్పలేదు. ఉండి సీటు నీకు లేదు అని రామరాజుకు కూడా చెప్పలేదు. నేనైతే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా. కండీషన్లు పెట్టి నేను టీడీపీలో చేరలేదు. అలాగని నేను పోటీలో లేకపోతే ప్రజలు అంగీకరిస్తారని అనుకోవట్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నేను పోటీలో ఉండటం పక్కా. అందులో అనుమానం లేదు. ఎమ్మెల్యేనే, ఎంపీనా అనేది చంద్రబాబు డిసైడ్ చేస్తారు. ఎక్కడనేది కూడా పార్టీ నిర్ణయిస్తుంది. జూన్ నాలుగో తేదీ వరకూ నేను నర్సాపురం ఎంపీని. నన్ను పీకేవాడు ఎవడూ లేడు. విజయనగరం సీటు నేను అడగలేదు. కానీ అక్కడున్న వాళ్లు నన్ను ఆహ్వానించారు. ఎక్కడి నుంచైనా పోటీలో ఉంటానని అనుకుంటున్నా" అని రఘురామకృష్ణరాజు చెప్పారు.


మరోవైపు విజయనగరం ఎంపీ అభ్యర్థిగానూ రఘురామకృష్ణరాజు పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానం నుంచి రఘురామకృష్ణరాజు వైసీపీ తరుఫున గెలుపొందారు. అయితే ఏడాదిలోపే ఆయన వైసీపీ రెబల్‌గా మారారు. ఇదే క్రమంలో ఢిల్లీలో ఉంటూ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకోసం రఘురామ ప్రయత్నించారు. వైసీపీ విధానాల మీద, సీఎం జగన్ తీరు మీద ఎప్పటికప్పుడూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆయనను బరిలో నిలపాలని టీడీపీ భావిస్తోంది. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలపాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఈ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. అయితే రఘురామకు బదులుగా శ్రీనివాసవర్మకు కమలం పార్టీ అవకాశం ఇచ్చింది. దీంతో రఘురామను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు.. ఎలాగైనా ఆయనను పోటీలో నిలపాలని భావిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa