ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మే 13వ తేదీ ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనను పూర్తిచేసిన పార్టీలు.. గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ సింగిల్గా బరిలోకి దిగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు.. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్లాన్ మార్చారు. ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేయనున్నారు.
ఇక టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత.. తొలి బహిరంగసభను చిలకలూరిపేటలో నిర్వహించారు. ఈ సభకు ప్రధాని మోదీ సైతం హాజరయ్యారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగసభలో పాల్గొనలేదు. ప్రచారాలు కూడా ఉమ్మడిగా నిర్వహించలేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా చంద్రబాబు చేపడుతున్న ప్రజాగళం మూడో విడతలో చంద్రబాబు,పవన్ కల్యాణ్లు కలిసి పాల్గొననున్నారు. ఏప్రిల్10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఏప్రిల్10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజాగళంలో పాల్గొంటారు. ఏప్రిల్ 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు. తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. చంద్రబాబు ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర పేరిట ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉమ్మడి గోదావరి జిల్లాలలో కలిసి ప్రచారం చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa