ఏపీలో జంపింగ్ జపాంగ్ల సీజన్ నడుస్తోంది. పార్టీల మధ్య నేతల గోడదూకుళ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మె్ల్యే ఒకరు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీబాల వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపిన యామినీబాల.. ఇంతకాలం సహకరించిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు టికెట్ దక్కలేదనే అసంతృప్తితోనే యామినీబాల రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
యామినీబాల.. సీనియర్ రాజకీయ నాయకురాలు శమంతకమణి కూతురు. శమంతకమణి టీడీపీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల సమయంలో తన కుమార్తెకు టీడీపీ టికెట్ వచ్చేలా చేసుకున్నారు. ఇక 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో యామినీబాల టీడీపీ తరుఫున శింగనమల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న యామినీ బాలకు టికెట్ నిరాకరించింది. బండారు శ్రావణికి అవకాశం ఇచ్చింది. దీంతో అసంతృప్తికి గురైన శమంతకమణి, యామినీబాల టీడీపీకి రాజీనామా చేశారు.
ఆ తర్వాత సీఎం జగన్ సమక్షంలో యామినీబాల, శమంతకమణి వైసీపీలో చేరిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి యామినీబాల శింగనమల టికెట్ ఆశించారు. కానీ వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు యామినీబాలకు సైతం టికెట్ నిరాకరించారు. కొత్త అభ్యర్థికి, టిప్పర్ డ్రైవర్గా పనిచేసిన వీరాంజినేయులుకు జగన్ అవకాశం ఇచ్చారు. దీంతో గత కొన్నిరోజులుగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన యామినీబాల.. శనివారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో యామినీబాల ఏ పార్టీలోకి వెళ్తారనేదీ ఆసక్తికరంగా మారింది.
అయితే శింగనమల స్థానానికి సంబంధించి టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బండారు శ్రావణికి మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో యామినీబాల కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్లో చేరి శింగనమల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు శుక్రవారమే హిందూపురం నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్కు రాజీనామా లేఖను సైతం పంపించారు. హిందూపురం టికెట్ ఇవ్వలేదనే విషయం కంటే.. అవమానాలను భరించలేకపోయానని మహ్మద్ ఇక్బాల్ ఆరోపించారు. ఆయన టీడీపీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. మహ్మద్ ఇక్బాల్ రాజీనామా ప్రకటించిన మరుసటి రోజే యామినీబాల సైతం రాజీనామా చేయడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి వరుస షాకులు తగిలినట్లు అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa