ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా ఉగాది ఉత్సవాలు.. మహాదుర్గగా శ్రీశైల భ్రమారాంబికా దేవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 07:47 PM

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం మహాదుర్గ దేవి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. నేటి సాయంత్రం కైలాసవాహంపై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పురవీధులలో ఆది దంపతులకు గ్రామోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయి.. స్వామివారి దర్శనానికి సుమారు 7 గంటల సమయం పడుతోంది.


 శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. యాగశాలలో శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు, ఈవో పెద్దిరాజు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలను అధికారులు నిలిపివేశారు.


భక్తుల రద్దీకి అనుగుణంగా అందరికి స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఈవో పెద్దిరాజు తెలిపారు. భక్తులందరికి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటిరోజు శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారికి మహాలక్ష్మి అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు బృంగి వాహనసేవ నిర్వహించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ఉత్సవాలు ముగిసే వరకు పలు ఆర్జితసేవా టిక్కెట్లను కూడా రద్దు చేశారు.


ఈ ఉత్సవాల్లో మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కాలినడకన శ్రీశైలానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా వీరి తాకిడి మరింత ఎక్కువగా ఉంది. కర్ణాటక నుంచి తండోపతండాలుగా భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. అటు, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రాక ఎక్కువగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa