ముకేశ్ అంబానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయిల్ కంపెనీలతో మొదలుపెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. వ్యాపార ప్రస్థానం ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరించడంలో ఈయన కృషి ఎనలేనిది. ఇటీవలి కాలంలో టెలికాం, రిటైల్ రంగాల్లోనూ దూసుకెళ్తోంది. ఇతర పెద్ద పెద్ద సంస్థలకు పోటీగా బ్రాండ్లను తీసుకొస్తున్నారు అంబానీ. భారత్లో ప్రస్తుతం అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన ఆస్తి 113 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 9.50 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. ఇవాళ అంబానీ 67వ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయన జీవితం గురించి.. ఇతర విశేషాల గురించి చూద్దాం.
తన వ్యాపార ప్రస్థానంలో ఎన్నో ఘనతల్ని సాధించారు ముకేశ్ అంబానీ. ప్రస్తుతం భారత్లో మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నం.1 గా ఉంది. ఈ సంస్థ ఛైర్మన్గా కొనసాగుతున్నారు అంబానీ. ఈ క్రమంలోనే ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. పక్కా వ్యూహాలతో ప్రత్యర్థులకు అందకుండా దూసుకెళ్లారు. దిగ్గజ వ్యాపారవేత్త ధీరూబాయ్ అంబానీ పెద్ద కుమారుడే ముకేశ్ అంబానీ. యెమెన్లోని అడెన్లో 1957, ఏప్రిల్ 19న ముకేశ్ జన్మించారు. తర్వాత వీరి కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. ముకేశ్ అంబానీకి భార్య నీతా అంబానీ.. ముగ్గురు పిల్లలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ (కూతురు), అనంత్ అంబానీ ఉన్నారు. వీరు ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్లోని వివిధ విభాగాల బాధ్యతలు చూస్తున్నారు.
నీతా అంబానీ ఇన్ని రోజులు రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, బోర్డు సభ్యురాలిగా ఉండగా.. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ యాజమాన్య బాధ్యతలు చూస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ బాధ్యతలు కూడా ఈమెనే చూసుకుంటున్నారు. ఆకాశ్ అంబానీ రిలయన్స్ జియో, ఇషా రిలయన్స్ రిటైల్, అనంత్ రిలయన్స్ ఎనర్జీ బాధ్యతలు చూసుకుంటున్నారు.
అంబానీ ఫేవరేట్ కెఫే..
ముకేశ్ అంబానీ అంత పెద్ద వ్యాపారవేత్త కాబట్టి క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే ఆయనకు కూడా కొన్ని అభిరుచులు ఉంటాయి. అందుకోసం ఎందరో షెఫ్లతో ప్రత్యేకంగా వంటలు చేయించుకుంటుంటారు. ఇంకా ముకేశ్ అంబానీకి ముంబైలో ఫేవరేట్ కెఫే ఏంటో తెలుసా.. కెఫే మైసూర్. తరచుగా అక్కడికి వెళ్తుంటారు. తన హీరో, స్ఫూర్తి తన తండ్రేనట. తన తండ్రి రూ. 100 చేతిలో పెట్టుకొని ముంబై వచ్చి.. బిజినెస్లో సక్సెస్ అయ్యారని ఒక సందర్భంలో చెప్పారు.
నో శాలరీ..
ముకేశ్ అంబానీ కరోనాకు ముందు వరకు దాదాపు ప్రతి సంవత్సరాలు ప్రతి ఏటా రూ. 15 కోట్ల చొప్పున వేతనం తీసుకున్నారు. అయితే కరోనా తర్వాతి నుంచి ఆయన అసలు వేతనం తీసుకోలేదట. అంటే జీరో శాలరీ అన్నమాట. అయితే జీతం తీసుకోకున్నా.. కొన్ని ప్రత్యేకమైన భత్యాలు చెల్లిస్తుంది. ట్రావెలింగ్, లాడ్జింగ్, బిజినెస్ ట్రిప్స్, బోర్డింగ్, కార్ ప్రొవిజన్స్, ఫోన్ బిల్స్ వంటివి రీయంబర్స్ చేస్తారు. అంబానీ కుటుంబం సహా ఆయనకు అయ్యే భద్రతా ఖర్చుల్ని కూడా కంపెనీనే భరిస్తుంది. అంబానీకి ముంబై ఆంటిలియాలో 27 అంతస్తుల అతిపెద్ద భవనం ఉంది. ఇందులోనే సకలసౌకర్యాలు ఉంటాయి. దీంట్లో వందల మంది పనివాళ్లు ఉంటారు. ప్రతి ఒక్కరికీ నెల జీతం రూ. 2 లక్షలపైనే ఉంటుందని గతంలో పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa