ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో ఈయనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థి..! ఏకంగా వేలకోట్లల్లో ఆస్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 08:02 PM

దేశంలో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా లోక్ సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం మొదలైపోగా.. చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు తమ ఆస్తిపాస్తులు, కేసులకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమ్మబాబోయ్ ఆయనకు అన్ని వేలకోట్లు ఉన్నాయా అనేలా చేస్తోంది.


ఎందుకంటే ఆయనకు ఐదొందలు, వేయికోట్లు ఆస్తికాదు.. ఏకంగా ఐదువేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ ఒక్క అఫిడవిట్ కారణంగా ఆయన పేరు మార్మోగిపోతోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక ఎంపీ అభ్యర్తి ఈయనేనని వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు.. గుంటూరు లోక్ సభ స్థానానికి టీడీపీ నుంచి బరిలో ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. పెమ్మసాని ఇవాళ (సోమవారం) నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహం మధ్య ఆయన ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.


ఈ క్రమంలోనే తన ఎన్నికల అఫిడవిట్లో తన కుటుంబానికి రూ.5,785. 28 కోట్ల ఆస్తి ఉన్నట్లు పెమ్మసాని వెల్లడించారు. రూ.5,598.65 కోట్ల విలువైన చరాస్తులు, రూ.186.63 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.1,038 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని పెమ్మసాని తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ్యాపారవేత్త గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పటంతో.. టీడీపీ పెమ్మసానిని గుంటూరు ఎంపీ సీటు కోసం బరిలోకి దింపింది.


గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడే ఎంబీబీఎస్ చదివారు. అనంతరం పైచదువుల కోసం అమెరికా వెళ్లిన పెమ్మసాని.. అక్కడే స్థిరపడ్డారు. మాస్టర్స్ పూర్తి చేసి జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. అలాగే మెడికల్ ఫీల్డ్‌లో స్థిరపడిపోయారు. పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. యూవరల్డ్ పేరుతో అమెరికాలో ఆన్ లైన్ ఎడ్యూటెక్ కంపెనీని పెమ్మసాని చంద్రశేఖర్ నడుపుతున్నారు. అయితే సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచారు పెమ్మసాని చంద్రశేఖర్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa