మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే మీ భూమి మీది కాదని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. జగన్కు ఇంకోసారి ఓటేస్తే ఉరి తాడేనన్నారు. శుక్రవారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. మండుటెండలో ఉండిలో, భారీవర్షంలోనూ గన్నవరంలో, ఒంగోలు నుంచి మాచర్ల ప్రజలతో వర్చువల్గా, ఒంగోలులో రోడ్షో నిర్వహించి భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. గత ఎన్నికల ముందు జగన్ ముద్దులుపెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారని.. ప్రజల భూములు, ఆస్తుల కబ్జాకు ఏకంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టమే తెచ్చారని విరుచుకుపడ్డారు. ‘భూమి మీదా, జగన్దా? మీ భూమిపై ఆయన ఫొటో ఏంటి..? మీ భూమిని మీకు ఎవరిచ్చారు? ఈ జగన్ ఇచ్చాడా.. వాళ్ల తాత ఇచ్చాడా.. నాన్న ఇచ్చాడా? జగన్ ఇచ్చే భూమి పత్రాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలను చించి చెత్త బుట్టలో వేయాలి. ఆయన మళ్లీ వస్తే మీ ఆస్తులు కొట్టేస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్ను ఆయనే నామినేట్ చేస్తాడట.. రిజిస్ర్టేషన్ చేయాలంటే ఆయన చెప్పిందే ఫైనల్ అట.. కోర్టుకు కూడా వెళ్లకూడదట.. జగన్ ప్రైవేటుగా పెట్టుకున్న వ్యక్తికి ప్రజల ఆస్తులపై పెత్తనమేంటి? వీటికి జగన్ సమాధానం చెప్పాలి. ప్రస్తుతం భూమికి సంబంధించి 10వన్, అడంగళ్ రికార్డులు ఉన్నా కొన్ని చోట్ల వైసీపీ నాయకులు భూమిని కాజేశారు. కొత్తచట్టంలో ఎంఆర్వో ఉండడు, ఆర్డీవో ఉండడట!! అందుకే హామీ ఇస్తున్నా. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపైనే. పట్టాదార్ పాస్పుస్తకంపై రాజముద్ర వేసి భూమిపై మీకు సర్వహక్కులు కల్పిస్తా. మంచి భవిష్యత్ కోసం ల్యాండ్ టైటిలింగ్ చట్టం కాపీలను చించి చెత్తబుట్టలో పారేద్దాం. సమయం లేదు మిత్రమా.. ఈ చట్టాన్ని మేం ఆమోదించబోమంటూ శనివారం సాయంత్రం 4 గంటలకు దాని ప్రతులను చించి చెత్తబుట్టలో పారేయండి’ అని పిలుపిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో దొంగలు పడి భూములను కబ్జా చేశారు.. రికార్డులు మార్చేశారని తెలిపారు. వైసీపీని గెలిపించేందుకు కృషి చేస్తే మీ ఆస్తులూ ఉండవని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ల్యాండ్ టైటిలింగ్పై మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa