ఏపీలో ఐదేళ్లకు ఒకసారి జరిగే ఓట్ల పండుగ మళ్లీ వచ్చేసింది. మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులు తిరిగి స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్, విజయవాడ మధ్య బస్సుల్లో రద్దీ పెద్ద ఎత్తున కనిపిస్తోంది. మరోవైపు ట్రైన్లలో కూడా అనేక మంది ఏపీకి పోతున్నారు. మరోవైపు విదేశాల్లో ఉన్న ఏపీ వాసులు సైతం వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారి వారి ప్రాంతాలకు తరలివస్తున్నారు.అయితే ఎన్నికలకు ముందు శని, ఆదివారం, సోమవారం కూడా సెలవు రోజులు కావడంతో ప్రజలు ఓటింగ్కు ముందుగానే తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది తమ సొంత ఊర్లకు చేరుకోగా, ఇంకొంత మంది తరలివెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సందడిగా మారిపోయాయి. మరోవైపు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు స్వగ్రామానికి వచ్చి తప్పనిసరిగా ఓటు వేయాలని కీలక నేతలు పిలుపునిచ్చారు. అయితే ఈసారి వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు గ్రామాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇంకోవైపు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులను తిరిగి స్వగ్రామాలకు తీసుకురావడానికి పలు పార్టీల నేతలు సైతం వారికి ఆఫర్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో మే 13న 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు, ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa