ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ.. గుట్టుగా నోట్ల కట్టలు తరలుతున్నాయి. అయితే ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘంతో పాటుగా స్థానిక పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కానుండటంతో... రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు, సోదాలు ముమ్మురం చేశారు. ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖఫట్నంలో ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన తనిఖీల్లో కోటిన్నర రూపాయల నగదు పట్టుబడింది.
వివరాల్లోకి వెళ్తే.. కారులో అక్రమంగా నగదు తరలిస్తున్నారంటూ సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని పాండురంగాపురం వద్ద తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో భాగంగా ఓ కారును ఆపిన అధికారులు.. అందులో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. అయితే తమ గుట్టు ఫ్లయింగ్ స్క్వాడ్కు తెలియగానే.. కారులోని వ్యక్తులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. కారులోని డబ్బును సీజ్ చేసిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్.. మొత్తం రూ.1.54 కోట్లు ఉన్నట్లు గుర్తించింది. పరారైన వారి కోసం పోలీసుల సాయంతో గాలిస్తున్నారు.
మరోవైపు సోమవారం ఉదయం పోలింగ్ జరగనుండటంతో.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో రాజకీయపార్టీలు ఉన్నాయి. ఆఖరి అస్త్రంగా డబ్బు, మద్యం, గిఫ్టులతో వారిపై వల విసురుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పలుచోట్ల భారీగా డబ్బు కట్టలు బయటపడుతున్నాయి. అయితే విశాఖలో దొరికిన కోటిన్నర సొమ్ము ఎవరిదనేదీ తెలియాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa