ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక తెరవెనుక యవ్వారాలకు తెరలేచింది. పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టిసారించిన పార్టీలు.. డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చుచేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు, మద్యం ఇలా.. వీలైనన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీల అభ్యర్థులు నగదు పంపిణీ.. ఓటుకు ఇంత అని లెక్కకట్టడం మామూలే. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం కొన్నిచోట్ల విచిత్రమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. మా ఓట్లు అమ్మబడవు అంటూ కొంతమంది ఇంటిముందు బోర్డులు తగిలిస్తుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం మా ఓటుకు నోటెందుకు ఇవ్వలేదూ అంటూ రోడ్డుపైనా నిరసనలకు దిగుతున్న పరిస్థితి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికల పండుగలో.. చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను చూస్తే నవ్వాలో ఏడవాలో పరిస్థితి.
కాకినాడ జిల్లా యు. కొత్తపల్లి మండలంలో తమకు డబ్బులివ్వలేదంటూ కొంతమంది ఆందోళనకి దిగారు. ఓ పార్టీ నేతలు కొంతమంది ఓటర్లకు మాత్రమే డబ్బులిచ్చారని..సుమారుగా ఓ వంద కుటుంబాలకు డబ్బులు పంపించలేదంటూ కొన్ని కాలనీలు రోడ్డుపైనే ఆందోళనకు దిగాయి. యు.కొత్తపల్లి మండలం కొండవరంలో సొంటివారి పాకల, ఇందిరా కాలనీవాసులు డబ్బు ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా అలమూరు మండలం పెదపళ్లలో ఓ పార్టీ తరుఫున చీరలు పంపిణీ చేశారు. అయితే నాసిరకం చీరలు ఇచ్చారంటూ కొంతమంది మహిళలు ఆ చీరలను తీసుకువెళ్లి స్థానిక నేత ఇంటి ముందు పడేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోనూ డబ్బులు పంపిణీ చేయలేదంటూ 18వ వార్డులో స్థానిక లీడర్లతో ఓటర్లు వాగ్వాదానికి దిగారు. లిస్టులో తమకు డబ్బులు ఇచ్చినట్లు టిక్కులు పెట్టుకుని , తమకు ఎందుకు మొహం చాటేస్తున్నారంటూ నిలదీశారు.
అయితే ఓటుకు నోటు ఇవ్వలేదంటూ రోడ్డుమీదకు వచ్చి నిలదీసేలా ప్రజల్లో వచ్చిన ఈ చైతన్యం.. ప్రజాసమస్యల విషయంలోనూ వస్తే బాగుంటుందని ఈ వీడియోలు చూసిన పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓటుకు వేయి ఇచ్చి.. మీ ఓటు కొనుగోలు చేసే రాజకీయ నేత.. అది తిరిగి సంపాందించుకోవాలంటే అవినీతినే ఆశ్రయిస్తారని.. అప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమని.. మన బతుకులు ఎలా మారతాయనేదీ ఆలోచించాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa