ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు జిల్లాలో జనం తీర్పు.. 14 నియోజకవర్గాల పోటీలో ఎవరెవరు.. ఈసారి గాలి ఎటువైపు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 05:41 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కర్నూలు జిల్లాకు ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం.. ఈ జిల్లాకు చెందిన ఎంతోమంది నేతలు ఏపీ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ల హవా ఉండేది. ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది..2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా మారింది. ఈ రెండు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపించింది.


ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధికంగా 11 చోట్ల విజయం సాధించగా.. టీడీపీ మూడు సీట్లలో మాత్రమే గెలిచింది. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే.. మొత్తం 14 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ టీడీపీ ఖాతా తెరవలేకపోయింది.


ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు లోక్ సభ స్థానాలు..


కర్నూలు, నంద్యాల లోక్ సభ స్థానాలు కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి నంద్యాల ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బ్రహ్మానందరెడ్డి పోటీలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జె.లక్ష్మీ నరసింహ యాదవ్‌ పోటీ చేస్తున్నారు.


2019 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ గెలిచారు. 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి తరఫున తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు పోటీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్‌‌ను పక్కన పెట్టింది.. మంత్రి గుమ్మనూరు జయరాంకు ఛాన్స్ ఇవ్వగా ఆయన తప్పుకుని టీడీపీలో చేరారు. దీంతో వైఎస్సార్‌సీపీ కర్నూలు మేయర్ బీవై రామయ్యను ఎంపీ అభ్యర్ఠిగా పోటీ చేయిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున రామ్‌ పుల్లయ్య యాదవ్‌ బరిలో ఉన్నారు.


కర్నూలు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు..


కర్నూలు, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు, కోడుమూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు, బనగానపల్లె, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి.


2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేసే స్థానాల విషయానికి వస్తే.. మొత్తం 14 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ నుంచి 13మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక స్థానంలో బీజేపీ పోటీ చేస్తోంది. జిల్లాలో వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది.


ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేపట్టింది. నందికొట్కూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్‌ను పక్కన పెట్టి డాక్టర్ దారా సుధీర్‌ను పోటీ చేయిస్తున్నారు. కోడుమూరులో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్‌ను పక్కన పెట్టి ఆదిమూలపు సతీష్‌ను బరిలోకి దింపారు. ఆలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంను పక్కన పెట్టి విరూపాక్షిని పోటీలో పెట్టారు. ఎమ్మిగనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని పక్కన పెట్టి మాజీ ఎంపీ బుట్టా రేణుకకు అవకాశం ఇచ్చారు. కర్నూలులో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్‌ను పక్కన పెట్టి.. రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్‌ను పోటీ చేయిస్తున్నారు. మిగిలిన స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే బరిలో ఉన్నారు.


టీడీపీ అభ్యర్థుల విషయానికి వస్తే.. నందికొట్కూరులో కొత్త అభ్యర్థి గిత్తా జయసూర్యను పోటీ చేయిస్తున్నారు. కోడుమూరులో కొత్త అభ్యర్థి బొగ్గుల దస్తగిరి పోటీలో ఉన్నారు. ఆలూరులో కోట్ల సుజాతమ్మకు బదులుగా వీరభద్ర గౌడ్‌ పోటీలో నిలిచారు. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి బదులు ఎన్‌ఎండీ ఫరూక్‌ను పోటీ చేయిస్తున్నారు. డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డి బదులు కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌ పోటీలో నిలిచారు. మంత్రాలయంలో తిక్కారెడ్డి బదులు.. రాఘవేంద్ర రెడ్డి బరిలో ఉన్నారు.


ఆంధ్రప్రదేశ్ శాసనభ, లోక్ సభ స్థానాలకు ఈ నెల 13 (సోమవారం)న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.. జూన్ 4 ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.


ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024 ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు..


నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి టీడీపీ కూటమి అభ్యర్థి


కర్నూలు ఎండీ ఇంతియాజ్ టీజీ భరత్


పాణ్యం కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి గౌరు చరిత రెడ్డి


నందికొట్కూరు డాక్టర్ దారా సుధీర్ గిత్తా జయసూర్య


కోడుమూరు ఆదిమూలపు సతీష్ బొగ్గుల దస్తగిరి


ఆళ్లగడ్డ గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి భూమా అఖిలప్రియ


శ్రీశైలం శిల్పా చక్రపాణిరెడ్డి బుడ్డా రాజశేఖర్ రెడ్డి


బనగానపల్లె కాటసాని రామిరెడ్డి బీసీ జనార్థన్ రెడ్డి


ఆలూరు బీ విరూపాక్షి వీరభద్ర గౌడ్


ఎమ్మిగనూరు బుట్టా రేణుక జయనాగేశ్వర రెడ్డి


ఆదోని వై సాయిప్రసాద్ రెడ్డి పీవీ పార్థసారధి


నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్‌‌ఎండీ ఫరూక్


డోన్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి


మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి


పత్తికొండ కంగాటి శ్రీదేవి కేఈ శ్యాంబాబు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa