ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ వేళ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనా స్పందించారు. ఓటర్ల వేళ్లపై సిరాతో మార్క్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రచారం చేస్తున్నారని.. ఈ సిరాను ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని.. బయట వ్యక్తుల దగ్గర ఈ సిరా ఉండే అవకాశమే లేదన్నారు. ఈ సిరా కేవలం ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉంటుందంటున్నారు. ఇరతుల దగ్గర చెరగని సిరా ఉంటుందనేది అసత్య ప్రచారమన్నారు. ఒకవేళ ఎవరైనా ఇతర సిరాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల వేళ్లపై ఇతర సిరా ద్వారా మార్క్ చేస్తే ఊరుకునేది లేదన్నారు.
వాస్తవంగా పోలింగ్ సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వాళ్ల వేలిపై సిబ్బంది సిరా వేస్తారు. దొంగ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఒకసారి ఓటు వేసిన ఓటరు మరోసారి ఓటు వేయకుండా ఉండేందుకు ఇలా సిరా మార్క్ వేస్తారు. అయితే కొంతమంది ఓటర్ల వేళ్లపై ఇంటి దగ్గరే సిరా ముందుగానే మార్క్ చేసి ఓటు వేయకుండా చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం స్పందించి.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. సిరా ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉంటుందని తెలిపారు.
జనసేన పార్టీ నేత నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో వైఎస్సార్సీపీ నేతలు భారీగా డబ్బుల్ని పంచుతున్నట్లు ఆయన ఆరోపించారు. అక్కడితో ఆగకుండా డబ్బలు తీసుకున్న వారి వేళ్లపై సిరా మార్క్ వేస్తారని తనకు తెలిసిందని.. అలా చేస్తే వారు ఓటు వేసినట్లు అవుతుందన్నారు. వారంతా సోమవారం జరిగే పోలింగ్లో ఓటు వేసేందుకు అనర్హులుగా మారుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సిరా గుర్తుతో పాటుగా డబ్బుల పంపిణీ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa