ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనిషికి పంది కిడ్నీ అమరిక.. అంతలోనే ఊహించని విషాదం

international |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 07:57 PM

పంది నుంచి సేకరించి జన్యుపరంగా మార్పిడి చేసిన కిడ్నీని అమర్చిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తి కథ విషాదంతమైంది. పంది కిడ్నీ అమర్చిన 62 ఏళ్ల రిచర్డ్ రిక్‌ స్లేమ్యాన్ మరణించినట్టు ఆయన కుటుంబసభ్యులు శనివారం వెల్లడించారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో రిచర్చడ్ రిక్‌కు మార్చిలో అవయవ మార్పిడి చికిత్స విజయవంతంగా నిర్వహించారు. సర్జరీ జరిగిన రెండు వారాల తర్వాత స్లేమ్యాన్ ఏప్రిల్‌లో డిశ్చార్జ్ అయ్యారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ, ఆయన హఠాత్తుగా మృతిచెందడంతో సర్జరీ నిర్వహించిన ఆసుపత్రి వైద్యులు విచారం వ్యక్తం చేశారు. అయితే, అతడి మృతికి కిడ్నీ మార్పిడి కారణం కాదని ధ్రువీకరించింది.


‘రిచర్డ్ రిక్ స్లేమాన్ ఆకస్మిక మరణంపై మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్య బృందం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.. ఇటీవల కిడ్నీ మార్పిడి వల్లే చనిపోయినట్టు ఎటువంటి సూచనలు లేవు’ అని పేర్కొంటూ హాస్పిటల్ ఓ ప్రకటన విడుదల చేసింది. మసాచుసెట్స్‌లోకి వేమౌత్‌కు చెందిన రిచర్డ్ స్లేమ్యాన్ కొన్నేళ్లుగా టైప్ 2 డయాబెటిస్‌, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతడి రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో డయాలసిస్‌పై ఆధారపడిన రిచర్డ్‌కు ఓ దాత ముందుకు రావడంతో 2018లో కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. ఈ సర్జరీ కూడా మసాచుసెట్స్ హాస్పిటల్ వైద్యులే నిర్వహించారు.


దురదృష్టవశాత్తు ఐదేళ్ల తర్వాత మార్పిడి చేసి కిడ్నీ తిరస్కరణకు గురైన సంకేతాలు రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మే 2023 నుంచి తిరిగి డయాలసిస్‌‌ మొదలుపెడట్టంతో ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేసిందని ఆసుపత్రి తెలిపింది. అనారోగ్య సమస్యలు చుట్టిముట్టడంతో స్లేమాన్‌కు వైద్యులు పంది కిడ్నీ మార్పిడి గురించి సలహా ఇచ్చారు. వైద్యులపై నమ్మకం ఉంచిన రిచర్డ్.. జన్యుపరంగా మార్పిడిచేసిన పంది కిడ్నీ అమర్చుకోడానికి అంగీకరించారు. దీంతో మార్చి 16న వైద్యులు నాలుగు గంటల శ్రమించి పంది కిడ్నీని అమర్చారు. ఆపరేషన్‌ జరిగిన రెండు వారాల పాటు హాస్పిటల్‌లో ఉన్నారు. కోలుకోవడంతో ఏప్రిల్ 1నడిశ్చార్జ్‌ అయ్యారు. ఈ తరుణంలో మే 11న స్లేమ్యాన్‌ మరణించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.


కేంబ్రిడ్జ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈజెనెసిస్ జన్యుమార్పులు చేసిన పంది కిడ్నీని రిచర్డ్ స్లేమ్యాన్‌కు వైద్యులు అమర్చారు. పంది నుంచి కిడ్నీ సేకరించి CRISPR-Cas9 సాంకేతికతను ఉపయోగించి జన్యుపరంగా మార్పులు చేశారు. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రక్రియలో పంది జన్యువులను తొలగించి, గ్రహీత శరీరానికి అనుకూలంగా ఉండే నిర్దిష్ట మానవ జన్యువులను అమర్చడం వంటివి ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa