అనుమానాస్పద రీతిలో వలంటీర్ మృతి చెందిన సంఘటన గుంటూరు- కర్నూలు రహదారిపై పల్నాడు జిల్లా కృష్ణాపురం గ్రామసమీపంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శావల్యాపురం మండలం వేల్పూరు పంచాయతీ పరిధిలోని గంటవారిపాలెం గ్రామంలోని పాముల కాలనీకి చెందిన గ్రామవలంటీర్ పులి గోపి (29) వ్యక్తిగత పనుల నిమిత్తం వినుకొండకు వెళ్ళి ద్విచక్రవాహనంపై తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. కృష్ణాపురం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందో లేక ఎవరైనా దాడి చేశారో తెలియని రీతిలో రోడ్డుపై బోర్లాపడి ఉన్నాడు. అతడి కుడి మోకాలుపైన, తలపైన రక్తపు గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ చల్లా సురేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. గోపి గంటవారిపాలెం గ్రామంలో వలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోపి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాడు. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు గోపీ, అతని కుటుంబసభ్యులు క్యూలైన్లో నిలబడి ఉండగా గ్రామానికి చెందిన వైసీపీ వర్గీయులు టీడీపీకి ఓటువేస్తే సాయంత్రానికి రక్తం కళ్ళ చూస్తామంటూ బెదిరించినట్లు సమాచారం. అనంతరం ఇలా అనుమానాస్పదంగా గోపి మృతిచెందడం చర్చనీయాంశంగా మారింది. మృతుని భార్య లక్ష్మి ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై పోలీసులు లోతైన విచారణ చేపట్టాలని మృతుని కుటుంబసభ్యులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa