పల్నాడు ప్రాంతంలో ఎన్నిల అనంతరం జరుగుతున్న హింస వెనుక అధికార వైసీపీ భారీ కుట్ర ఉన్నట్టు మాజీ మంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్ధి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. గురువారం పట్టణంలోని తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడ వచ్చని, వారి చేతుల్లో పావులుగా మారి కొందరు పోలీసు అధికారులతో పెను ప్రమాదం పొంచి ఉందని తాము మొదటి నుంచి వాపోతున్నామని, అప్పుడే పట్టించుకొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? అని ప్రత్తిపాటి ప్రశ్నించారు. కలెక్టర్ బదిలీ, ఎస్పీ సస్పెన్షనలతోనే అంతా అయిపోలేదని, తెర వెనుక ఉన్న అసలు శక్తులు వారి కుట్రలను తెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ఓటమి భయంతో ఎన్నడూ లేని విధంగా దాడులు చేయిస్తుందని, వాటిని నిలువరించటంలో ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ విఫలమయ్యారని చెప్పక తప్పదన్నారు. గొడవలు, కేసుల్లో ఇరికించి వాటిని బయట పడే వరకైనా నాయకులు, శ్రేణులను అంటిపెట్టుకోవటానికే సైకో ముఖ్యమంత్రి డైరెక్షనలో ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహే్షరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు తదితరులంతా ఈ విధ్వంస రచనకు దిగారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దాడులను ప్రోత్సహించలేదన్న ప్రత్తిపాటి మాచవరం మండలం పిన్నెల్లిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ గ్రామం రావణకాష్టంగా మారిందన్నారు. కుటుంబాలను వెలి వేయటం, చివరకు హైకోర్టు ఆదేశాలతో ఇటీవల వారంతా బిక్కుబిక్కుమంటూ గ్రామానికి రావటం, వైసీపీ రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు. అలాంటి పిన్నెల్లి గ్రామంలో వైసీపీ నాయకుల ఇంట్లో నాటు బాంబులు దొరికితే పోలీసులు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చివరకు బొల్లాపల్లిలో వైసీపీ మూకలు ఎస్ఐనే కొట్టినా దాచి పెట్టి ఎవ్వరిని కాపాడాలని చూస్తున్నారన్నారు. అందుకే ఎస్పీలు మారినా కిందిస్థాయిలో జగన భక్త డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐల వల్ల పరిస్థితి మరింత చేయి దాటుతుందని ప్రత్తిపాటి మరింత ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్పీ, కలెక్టర్లతో పాటే ఈ యంత్రాంగాన్ని మొత్తం మారిస్తే తప్ప పల్నాడులో హింస అదుపులోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. ముప్పాళ్ళ మండలం మాదలలో వైసీపీ నేత ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు దొరికాయని, వాటిని ఎవరు తయారు చేస్తున్నారో పోలీసులు కనిపెట్టలేరా? ప్రశ్నించారు. వైసీపీ రౌడీ నాయకులతో నాటుబాంబులు, పెట్రోల్ బాంబులు తయారు చేస్తున్న వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని, పిన్నెల్లి, మాదలలో దొరికిన బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు. దాడులు, హింస ఆపలేని ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కమిటీ మాత్రం ఎందుకు ఆపారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ రౌడీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు చేశామని చెపుతున్నారని, ఆ పని మొదటి రోజే చేసి ఉంటే ఈ అరాచకాలు జరిగి ఉండేవి కాదు కదా? అని ఆయన ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa