ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడందరి దృష్టి జూన్ నాలుగో తేదీ వెల్లడయ్యే ఫలితాలపైనే ఉంది. ఎవరు గెలుస్తారనే దానిపై జోరుగా పందేలు కూడా సాగుతున్నాయి. ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ పథకాలు అమలు చేస్తారనే దానిపై ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో పార్టీలు హామీల వర్షం కురిపించాయి. ప్రధానంగా టీడీపీ కూటమి మహిళలు, యువత లక్ష్యంగా హామీలు గుప్పించింది. సూపర్ సిక్స్ అంటూ అన్ని వర్గాలను కవర్ చేసేలా టీడీపీ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. అందులో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. మహిళలకు ఫ్రీబస్ పథకం ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలలో అమలవుతుండగా.. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు మీడియా సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో పలు అంశాలపై తన అభిప్రాయాన్ని మోదీ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై ప్రధానమంత్రి తన వైఖరి తెలియజేశారు. బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని మోదీ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఇస్తున్నాయని.. ఇలా చేయడం వలన మెట్రో నిర్వహణ సాధ్యం కాదని మోదీ అన్నారు. ట్రాఫిక్తో పాటుగా పర్యావరణానికి సైతం ప్రమాదమేనని చెప్పారు. బస్సుల్లో ప్రయాణం ఫ్రీగా ఇస్తే మెట్రో ఎలా నడుస్తుందని ప్రధాని మోదీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి సైతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ, జనసేన కలిసి తయారుచేసినప్పటికీ.. కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి పార్టీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మేనిఫెస్టో ప్రకటన సమయంలోనూ బీజేపీ అంటీముట్టనట్టుగా ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఉచిత హామీలు నచ్చకనే మేనిఫెస్టోపై ప్రధాని మోదీ, బీజేపీ గుర్తులు లేవంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ మేనిఫెస్టో టీడీపీ, జనసేన కలిసి తయారుచేసిందని.. దీనికి కేంద్రంలోని బీజేపీ సహకారం ఉంటుందని చెప్పారు. అలాగే బీజేపీకి జాతీయ మేనిఫెస్టో ఉన్నందున ప్రత్యేకంగా రాష్ట్రానికి మేనిఫెస్టో అవసరం లేదని చెప్పారు.
అయితే ఇప్పుడు ఫ్రీబస్ పథకం గురించి ప్రధాని మోదీ మాట్లాడటం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది, కూటమి ఇచ్చిన హామీ గురించి మోదీ వ్యతిరేకంగా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో మెట్రో లేకపోయినప్పటికీ.. ఉచిత బస్సు ప్రయాణం హామీతో పర్యావరణానికి కూడా ముప్పేనంటూ ప్రధాని వ్యాఖ్యానించడం కూటమికి ఇబ్బందికరంగా మారింది. భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరుగుతుందా లేదా అనే సంధిగ్ధం ఏర్పడిందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి.
అటు తెలంగాణ, ఢిల్లీ, కర్నాటకలో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. తెలంగాణలో మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో మెట్రోల్లో ప్రయాణించే మహిళల సంఖ్య తగ్దింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నిర్వహణ చూస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ సైతం మెట్రో నిర్వహణ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి ఫ్రీబస్ గురించి ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపైనా ఇప్పటికే విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. దేశవ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని కోరుతుంటే.. ప్రధాని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి, మంత్రులకు విమాన ప్రయాణాలు ఉచితమైనప్పుడు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఉండకూడదా అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa