ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చొక్కాలు పట్టుకుని.. ఎత్తిపడేసి వీధి రౌడిల్లా కొట్టుకున్న ఎంపీలు.. వీడియోలు వైరల్

international |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 10:30 PM

ప్రజలకు రోల్ మోడల్‌గా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు విచక్షణ కోల్పోయి.. చట్టసభలోనే కొట్లాటకు దిగుతున్నారు. ప్రజల గొంతుకను పార్లమెంట్‌లో వినిపించాల్సిన చట్టసభ సభ్యులు వీధి రౌడీల్లా ప్రవర్తించిన ఘటన తాజాగా తైవాన్ జాతీయ అసెంబ్లీలో చోటుచేసుకుంది. చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు భౌతిక దాడికి తెగబడ్డారు. ఓ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య మొదలైన వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారినట్టు క్రమంగా ఘర్షణకు దారితీసింది. దీంతో ప్రజాప్రతినిధులు పరస్పర దాడిచేసుకుని..ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు.


శుక్రవారం ఉదయం పార్లమెంట్‌లో సంస్కరణలకు సంబంధించి ఓ బిల్లును అధికార పార్టీ ప్రతిపాదించింది. ఈ సందర్భంగా బిల్లులో కొన్నింటిపై అభ్యంతరం వ్యక్తం చేసిన విపక్షాలు.. కొన్ని డిమాండ్లు చేశాయి. అంతేకాదు, ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ఎంపీలకు మరిన్ని అధికారాలు ఉండాలని పట్టుబట్టాయి. అంతేకాదు, చట్టసభలో తప్పుడు ప్రకటనలు చేసే సభ్యులపై నేరాభియోగాలు నమోదుచేసేలా బిల్లులో ప్రతిపాదనలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లుపై ఓటింగ్ జరగడానికి ముందే ఎంపీల ఛాంబర్‌లో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.


అనంతరం సభలో చర్చ జరుగుతుండగా సభ్యులు మరోసారి వాగ్వాదానికి దిగడంతో ఘర్షణకు దారితీసింది. ఎంపీలు ఒకరినొకరు నెట్టుకుంటూ... కొందరు టేబుళ్ల పైనుంచి దూకి స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. మరికొందరు తోటి ఎంపీలను ఎత్తికుదేసి ముష్టిఘాతాలు కురిపించారు. అంతేకాదు, బిల్లు ఆమోదం పొందకుండా ఓ సభ్యుడు దస్త్రాలను దొంగలించి సభ నుంచి బయటకు పరిగెత్తాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ మీడియాలో ప్రసారం కాగా.. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.


మరికొద్ది రోజుల్లో తైవాన్‌లో కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీకి చెందిన లాయ్‌ చింగ్‌ తే విజయం సాధించిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ బిల్లుపై డీపీపీ ఎంపీ వాంగ్ మెయి-హుయి మాట్లాడుతూ.. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? మేము చర్చలు జరపాలని కోరుకుంటున్నాం.. దేశంలో ఒకే స్వరం ఉండకూడదని మా ఉద్దేశం అని అన్నారు. .


కేఎంటీ సభ్యురాలు జెస్సికా చెన్ మాట్లాడుతూ.. కార్యనిర్వాహక శాఖ శాసనపరమైన పర్యవేక్షణను మెరుగుపరచడానికి సంస్కరణలు చేపట్టినట్టు తెలిపారు. గుత్తాధిపత్యం చెలాయించడానికి అలవాటు పడిన డీపీపీకి దీనిని ఆమోదించడం ఇష్టం లేదని ఆమె విమర్శించారు. తైవాన్ పార్లమెంట్‌లో కేఎంటీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో చిన్న పార్టీ మద్దతుతో బిల్లును ఆమోదింపజేయాలని భావించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa