ఏపీకి వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తుఫాన్గా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం తుఫాన్గా బలపడుతుందని.. అనంతరం ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని అధికారులు ఓ అంచనా వేస్తున్నారు. అయితే తుఫాన్ ముప్పు ఏపీకి లేదని భావిస్తున్నారు.. ఆ అల్పపీడనం ఏర్పడిన తర్వాత మరికొంత క్లారిటీ వస్తుంది అంటున్నారు. బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఏపీలో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రెండు, మూడుచోట్ల భారీగా వానలు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి.. శ్రీసత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువులో 42.5, చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో 38.2, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, విజయనగరం జిల్లా కొత్తవలసల్లో 30.5, అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 27.2, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 26 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంటున్నారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఈనెల 24నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడనుంది. ఇది తుఫాన్గా మారి.. ఈనెల 25వ తేదీ నాటికి ఇది ఒడిశా తీరం దిశగా వెళుతుందని భావిస్తున్నారు. అయితే తుఫాన్ ఒడిశా, పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటుతుందని అంచనా ఉంది. ఇటు రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. ఈ నెలాఖరునాటికి కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలోకి కూడా వచ్చే నెలలో ప్రవేశించే అవకాశం ఉందంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa