తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసిన.. 1,400లకుపైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన సంగీత జ్ఞాని, స్వరమాంత్రికుడు ఇళయరాజా. భారతీయ చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మ్యాస్ట్రోకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇళయరాజా పేరిట ఓ మ్యూజిక్ రిసెర్చ్ సెంటర్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం)లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రానికి సోమవారం త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఇళయరాజా కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఐటీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ.. సంగీతం గురించి తెలుసుకోవడానికి లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో కృత్రిమ మేధ కూడా తోడైందని, తద్వారా మరిన్ని పరిశోధనలు చేయడానికి అవకాశం కలిగిందని ఆయన పేర్కొన్నారు. ఇక, పాత రోజులను గుర్తుచేసుకున్న ఇళయరాజా.. చిన్నతనంలో తన సొంతూరులో ఎవరూ సంగీతం టీచర్లు లేరని అన్నారు. తన సోదరుడితో కలిసి మద్రాసుకు వచ్చిన తాను ఎవరి వద్దా ఇప్పటి వరకూ ప్రత్యేకంగా సంగీతం నేర్చుకోలేదని తెలిపారు.
నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండి.. పట్టుదలతో కృషి చేస్తే ఇష్టమైన రంగంలో రాణించవచ్చని యువతకు సూచించారు. మీరు కూడా నాతో చేరాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ‘ప్రపంచ దిగ్గజ సంగీత కళాకారుడు మొజార్టీ శకం ముగిసిన 200 ఏళ్ల తర్వాత ఐఐటీ-మద్రాసు లాంటి సంస్థ 200 మంది ఇళయరాజాలను తయారు చేయాలి. సంగీతం నా ఊపిరి’ అని అన్నారు. ‘ఈ ప్రాజెక్ట్ చాలా ఆలోచనల ఫలితం.. మీరు ప్రపంచమంతటా మీ పరిశోధనలను వ్యాప్తి చేయాలి’ అని విద్యార్థులను ఇళయరాజా కోరారు. అనంతరం ఇళయరాజా, ఐఐటీ మద్రాస్ డైకెర్టర్ ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు. మరోవైపు, ‘స్పిక్మాకే’ పేరిట తొమ్మిదో అంతర్జాతీయ సాంస్కృతిక వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇవి వారం రోజులపాటు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa