ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయిదాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్కు బెయిల్ మంజూరైంది. విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు సతీష్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోరుతూ సతీష్ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన కోర్డు.. సోమవారం తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పిటిషన్ విచారణలో భాగంగా.. నిందితుడి తరుఫున వాదించిన న్యాయవాది సలీం.. సతీష్ను పోలీసులు అనవసరంగా ఈ కేసులో ఇరికించారని వాదించారు. అయితే సతీష్ కావాలనే వైఎస్ జగన్ మీద దాడి చేశారంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. సోమవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ (మంగళవారం) బెయిల్ మంజూరు చేశారు.
మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా విజయవాడలో వైఎస్ జగన్ పర్యటించిన సమయంలో ఆయనపై రాయిదాడి జరిగింది. అజిత్ సింగ్ నగర్ సమీపంలో ఆయనపై దాడి జరగ్గా.. ఈ ఘటనలో వైఎస్ జగన్ ఎడమకన్ను పైభాగంలో గాయమైంది. ముఖ్యమంత్రి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్కు సైతం కన్నుకు గాయమైంది. ఈ ఘటనపై వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక సిట్ దర్యాప్తులో రాయి విసిరింది అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్కుమార్గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ లక్ష్యంగా కాంక్రీట్ రాయిని విసిరినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అనంతరం కోర్టు ఎదుట హాజరుపరచగా.. న్యాయస్థానం కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగిసిన తర్వాత నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా సతీష్ కొనసాగుతున్నారు. ఇదే సమయంలో బెయిల్ కోరుతూ విజయవాడ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa