నేరగాళ్లు రూటుమారుస్తున్నారు. రోజురోజుకూ కొత్త పద్ధతిలో నేరాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు వారి ప్రయత్నాలు ఫలించినా.. చాలాసార్లు పోలీసుల ఎత్తుగడల ముందు చిత్తు అవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో బంగారం అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారం బయటపడింది. బంగారం అక్రమంగా తరలించేందుకు నిందితులు చేసుకున్న ఏర్పాట్లు చూసి పోలీసులు కూడా ముక్కున వేలేసుకున్నారు. అమ్మబాబోయ్ ఏం తెలివిరా నాయనా అంటూ షాక్ తిన్నారు. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. బంగారం అక్రమ రవాణా జరుగుతోందంటూ కావలి పోలీసులకు సమాచారం అందింది. దీంతో కావలి పోలీసులు.. కలకత్తా- చెన్నై రహదారిపై తనిఖీలు నిర్వహించారు. వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఓ కారులో తరలిస్తున్న మూడు కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పేపర్లు లేకుండా కారులో తరలిస్తున్న రెండుకోట్ల విలువైన మూడు కిలోల బంగారు బిస్కెట్లను పోలీసులు సీజ్ చేశారు. కారు వెనుక సీట్లో ప్రత్యేకంగా ఓ అరను ఏర్పాటు చేసుకున్న నిందితులు.. బంగారాన్ని అందులో దాచి తరలిస్తున్నారు.
అయితే ఈ బంగారానికి సంబంధించి ఎలాంటి పేపర్లు చూపకపోవటంతో బంగారాన్ని సీజ్ చేసి.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ బంగారాన్ని చెన్నై నుంచి విజయవాడ తరలిస్తున్నట్లు తెలిసింది. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు పూర్తైనప్పటికీ.. ఫలితాల వెల్లడి పూర్తికాలేదు. జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఏపీలో జూన్ ఆరో తేదీ వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa