ఇటీవల దేశంలో లోక్సభ ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడి కావడంతో అధికారంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు భారత ఎన్నికల ఫలితాలపై స్పందిస్తున్నాయి. హ్యాట్రిక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోదీకి.. వివిధ దేశాల అధినేతలు అభినందనలు చెబుతున్నారు. ఇక ప్రమాణ స్వీకార మహోత్సవానికి వివిధ దేశాల అధ్యక్షులకు ఆహ్వానాలు అందగా.. వారంతా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే భారత్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు దాయాది దేశం పాకిస్థాన్ స్పందించింది. మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు సంచలన వ్యాఖ్యలు చేసింది.
భారత్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న వేళ.. శుభాకాంక్షలు ఎందుకు తెలపలేదని మీడియా అడిగిన ప్రశ్నకు పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ స్పందించారు. భారత్లో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదని.. అందుకే అభినందనలు తెలపలేదని క్లారిటీ ఇచ్చారు. భారత ఎన్నికల ప్రక్రియపై తాము మాట్లాడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. అక్కడ ఇంకా కొత్త ప్రభుత్వం రాలేదు కాబట్టి.. ఇప్పుడే అభినందనలు చెప్పడం తొందరపాటు చర్య అవుతుందని చెప్పారు. అంతేకాకుండా తమను ఎవరు పాలించాలి అని నిర్ణయించుకోవడం భారత ప్రజల హక్కు అని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగానే పొరుగు దేశాలతో పాకిస్తాన్ సత్సంబంధాలు కోరుకుంటోందని.. ముంతాజ్ జహ్రా బలోచ్ వెల్లడించారు. భారత్తో పాటు పక్కనే ఉన్న ఇతర దేశాలతో పాక్ స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా.. జమ్మూ కాశ్మీర్తో పాటు ఇతర ప్రధాన వివాదాలను నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ చూస్తోందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక వివాదాల పరిష్కారం కోసం.. అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు భారత్ తగిన చర్యలు తీసుకుంటుందమని ఆశిస్తున్నామని ముంతాజ్ తెలిపారు.
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370 ని 2019 లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్ తీసుకున్న నిర్ణయం.. పొరుగు దేశాల మధ్య చర్చలు జరిపే పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని పాక్ అప్పట్లో ఆరోపణలు చేసింది. అయితే.. భారత్ మాత్రం పాక్తో సత్సంబంధాలనే కోరుతూ వచ్చింది. ఆ దాయాది దేశంతో చర్చలకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామని.. చర్చలకు తాము తలుపులు మూయలేదని చెప్తూ వస్తోంది. పాక్తో ఇతర సమస్యలు ఉన్నప్పటికీ.. అక్కడ పెద్ద సంఖ్యలో ఉగ్రవాద కేంద్రాలున్నాయి కాబట్టి ఉగ్రవాదంపైనే ప్రధానంగా చర్చ ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గతంలో వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa