మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇటలీ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అక్కడ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాల అధినేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో పశ్చిమ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడిని సైతం తట్టుకుని భారత్.. స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే ఇరు దేశాల మధ్య తలెత్తిన సమస్యలు పరిష్కరించుకోవాలని ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులకు భారత్ సూచిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్కు పలుమార్లు భారత్ దూరంగా ఉంది.
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతియుత పరిష్కారం కోసం భారత్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ముందు మొదట కలుసుకోగానే.. మోదీ, జెలెన్స్కీ ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన మోదీ.. జెలెన్స్కీతో చాలా ప్రొడక్టివ్ భేటీ జరిగిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు భారత్ ఆసక్తిగా ఉందని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారానే ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదంలో శాంతికి మార్గమని భారత్ విశ్వసిస్తుందని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
ఈ భేటీలో ప్రస్తుతం రష్యాతో ఉక్రెయిన్తో జరుగుతున్న ఘర్షణకు సంబంధించి పలు అంశాలను నరేంద్ర మోదీకి.. జెలెన్ స్కీ వివరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ జీ7 సదస్సులో కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించే చర్చ జరిగింది. ఫ్రీజ్ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్కు 50 బిలియన్ల డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేయగా.. ఆ ప్రతిపాదనకు జీ7 సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి.
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇటలీ వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆహ్వానిత దేశంగా పాల్గొంది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్తో వేర్వేరుగా మోదీ భేటీ అయ్యారు. రక్షణ, అంతరిక్ష, విద్య, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ, మేక్రాన్ చర్చలు జరిపారు. దాంతోపాటు పలు కీలక విషయాలపై తమ మధ్య చర్చ జరిగినట్లు మోదీ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa