రాష్ట్రంలో విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు మంత్రి నారా లోకేష్. ఆయన్ను రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అమరావతిలోని సచివాలయంలో కలిశారు. వారి సమస్యలపై మంత్రి లోకేష్కు వినతిపత్రాలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా ఉపాధ్యాయులపై అనవసరమైన పని భారం, వేధింపులు ఉండవన్నారు మంత్రి లోకేష్.
ఏపీలో గత ఐదేళ్లుగా ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యాప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు లోకేష్. తన దృష్టికి తెచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలకు తెలిపారు. అంతకుముందు నారా లోకేష్ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖలమంత్రిగా వెలగపూడిలోని సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు.మెగా డీఎస్సీకి సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. అలాగే పలు ఫైల్స్ను పరిశీలించారు.
ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీ సమయంలో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులను మినహాయించి నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ పాలిటెక్నిక్ ఆల్ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ మంత్రి లోకేష్ను కోరారు. అలాగే పాఠశాల విద్యాశాఖలో జీవో 117ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ వినతుల్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి లోకేష్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa