ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెంపుడు కుక్క కాటు, యువకుడి నిండు ప్రాణం బలి.. చిన్న నిర్లక్ష్యం, మాటలకందని విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 08:43 PM

ఆ ఇంట్లో ఓ కుక్కను ముద్దుగా పెంచుకుంటున్నారు.. కుటుంబసభ్యులందరికి ఆ కుక్కంటే ఎంతో ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆ మూగజీవి కూడా ఇంట్లో ఒక మెంబర్ అని చెప్పాలి. అంత ఇష్టంగా పెంచుకున్న కుక్క ఇంట్లో రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది.. చిన్న పొరపాటుకు యువకుడు బలయ్యాడు. విశాఖపట్నం జిల్లా భీమిలిలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.


 భీమిలికి చెందిన 59 ఏళ్ల నర్సింగరావు ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేశారు. అయితే, తొమ్మిదేళ్ల క్రితం ఆయనకు పెరాలసిస్ రావడంతో ఇంట్లోనే మంచానికి పరిమితమయ్యారు. ఆయన కుమారుడు భార్గవ్ రైల్వేలో పనిచేస్తున్నారు. ఈనెల 9న భార్గవ్‌ను పెంపుడు కుక్క ముక్కుపై కరిచింది. అది పెద్ద గాయం కాకపోవడంతో భార్గవ్ పట్టించుకోలేదు. అయితే, ఆ తర్వాత భార్గవ్ తల్లి చంద్రావతిని కూడా పెంపుడు కుక్క కరిచింది. దీంతో అప్రమత్తమైన తల్లి.. కొడుకుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి టీకా వేయించుకున్నారు.


మరోవైపు, నర్సింగరావు ఆరోగ్యం బాగోకపోవడంతో పదిరోజుల క్రితం విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. తండ్రి హాస్పిటల్‌లో ఉండడంతో తనను కుక్క కరిచిన విషయాన్ని భార్గవ్ పట్టించుకోలేదు. ఒక్క డోస్ టీకా మాత్రమే వేయించుకున్నారు. దీంతో రేబిస్ ఆయన మెదడుకు వ్యాపించింది. ఆరోగ్యం విషమించి రెండు రోజుల క్రితం భార్గవ్ మృతి చెందారు.


నర్సింగరావు, భార్గవ్ చనిపోవడానికి రెండు రోజుల ముందు పెంపుడు కుక్క కూడా చనిపోయింది. దీంతో తండ్రీకొడుకులు కూడా రేబిస్‌తో చనిపోయారని స్థానికంగా భయం అలుముకుంది. దీనిపై స్థానిక వైద్యారోగ్య శాఖ సిబ్బందికి సమాచారం అందడంతో వారు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు అందించిన వివరాలతో పాటు కేజీహెచ్‌లో నర్సింగరావు డెత్ రిపోర్టును పరిశీలించిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది.. కేవలం భార్గవ్ మాత్రమే రేబిస్‌తో చనిపోయారని నిర్ధారించారు.


రేబిస్‌ను హైడ్రోఫోబియా అని కూడా అంటారు. ఇది చాలా భయంకరమైన లిస్సా వైరస్ వలన వస్తుంది. ఇది క్షీరదాల నుండి ఇతర జంతువులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. కుక్కలు, నక్కలు, తోడేళ్లు, పిల్లులు, ఎలుగుబంట్లు, కోతులు, తదితర కార్నివరస్ జంతువులకు రేబిస్ వ్యాపిస్తుంది. ఈ జబ్బుతో ఉన్న జంతువు మనిషికి కరిస్తే ఈ వ్యాధి మనుషుల్లోనూ వ్యాప్తిచెందుతుంది. రేబిస్ వ్యాధికి మందులేదు. రేబిస్ సోకిన కుక్క కరిస్తే వెంటనే టీకాలు వేసుకుంటే ప్రమాదాన్ని నివారించవచ్చు. కానీ, ఈ టీకా నూటికి నూరుపాళ్లు సురక్షితం అయితే కాదు.


కుక్క కరిచినపుడు ధారగా పడుతున్న నీటితో 15 నిమిషాల పాటు గాయాన్ని కడగాలి. దీని వల్ల కుక్క లాలాజలం శరీరంలోకి ప్రవేశించకుండా, రేబిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. సబ్బు లేదా యాంటీసెప్టిక్‌ లోషన్‌తో గాయాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు కెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. కుక్క కరిస్తే చాలామంది గాయాన్ని చేతితో ముట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎంతమాత్రం మంచిది కాదు. గాయాన్ని నేరుగా చేతులతో ముట్టుకోకుండా చేతులకు గ్లౌజ్లు వేసుకొని ముట్టుకోవాలి. గాయం పెద్దగా అయితే కానీ కుట్లు వేయకూడదు. ఒకవేళ కుట్లు తప్పనిసరి అయినా వాటిని వదులుగా వెయ్యాలని గుర్తించుకోవాలి.


కుక్క కరిచిన చోట మూసి ఉంచొద్దు. నీరు, రక్తం కారిపోయినా వదిలేయాలి. కుక్క కరిస్తే ముందుగా ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలి. గాయం మానటానికి యాంటీ బయోటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. యాంటీ రేబీస్ టీకాను అవసరాన్ని బట్టి మూడు లేదా ఐదు మోతాదుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వైద్యుల సలహా మేరకు కొన్ని ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలాగే కుక్కలకు కూడా వ్యాక్సిన్‌లు వేయాలించాల్సిన అవసరం ఉందంటున్నారు డాక్టర్లు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa