వాతావరణ అనిశ్చితితో బుధవారం సాయంత్రం విశాఖపట్నం నగరం, శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘాలు ఆవరించినా ఉక్కపోత కొనసాగింది. అయితే మధ్యాహ్నం తరువాత మేఘాలు ఆవరించి చల్లని గాలులు మొదలయ్యాయి. అనంతరం కొద్దిసేపటికి వర్షం ప్రారంభమైంది. సుమారు గంటపాటు నగరంలో ఒక మోస్తరుగా, శివారు ప్రాంతాల్లో జోరుగా వాన కురిసింది. ఆరిలోవలో 48.5 మి.మీ.లు, పెందుర్తి జోనల్ కార్యాలయం వద్ద 37.75, సింహాచలంలో 35.25, కాపులుప్పాడలో 34.75, గోపాలపట్నంలో 28.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాగా వాతావరణ అనిశ్చితితో వర్షం కంటే మెరుపులు, పిడుగుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం 6.33 గంటలకు విశాఖకు 20 కి.మీ. వైశాల్యంలో 2,405 మెరుపులు సంభవించినట్టు కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ రూపొందించిన ‘దామిని’ యాప్లో నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa