విలక్షణ నటుడు రావు రమేష్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు విరాళం అందించారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం రఘురామకృష్ణరాజు డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు తీర్చడానికి, నియోజకవర్గ అభివృద్ధి పనులకు ప్రజలు, ప్రముఖుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు రావు రమేష్ కూడా తన తరుఫున మూడు లక్షల రూపాయల విరాళం అందించారు. ఈ మేరకు రఘురామకృష్ణరాజుకు ఈ విరాళం తాలూకు చెక్కును అందించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా రఘురామకృష్ణరాజు ట్వీట్ చేశారు.
మరోవైపు రఘురామ ఏర్పాటు చేసిన డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కు సినీ నిర్మాత అశ్వనీదత్ కూడా ఇటీవలే విరాళం అందించారు. ఈ నిధికి రూ.5 లక్షలు విరాళం అందజేశారు. ఈ విషయాన్ని కూడా రఘురామ ఎక్స్ వేదికగా ప్రకటించారు. పలువురు ప్రముఖులు ఈ నిధికి విరాళాలు అందిస్తున్నారని. ప్రజలకు, రైతులకు కృతజ్ఞతలు తెలుపడం, ఉండి నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ నిధులతో ఇప్పటికే ఉండి నియోజకవర్గంలోని పలుచోట్ల కాలువల పూడికతీత పనులు చేపట్టారు.
రఘురామకృష్ణరాజు విషయానికి వస్తే.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరారు. తొలుత నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కూటమిలోని ఏదో ఒక పార్టీ తరుఫున నరసాపురం ఎంపీ సీటు నుంచి పోటీచేయాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఈ సీటును బీజేపీ సొంతం చేసుకుంది. బీజేపీ తరుఫున భూపతిరాజు శ్రీనివాసవర్మ పోటీచేశారు. దీంతో రఘురామను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు నాయుడు.. ఉండి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిపారు. అప్పటికే మంతెన రామరాజుకు టికెట్ కేటాయించగా... ఆయనను కాదని చివరి నిమిషంలో రఘురామకు టికెట్ ఇచ్చారు. ఇక అధినేత నమ్మకాన్ని నిజం చేస్తూ 50 వేల పైచిలుకు ఓట్ల తేడాతో రఘురామ గెలుపొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa