ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆర్థికంగా చేయూతనివ్వాలని కేంద్రప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్లో నిధులు పెంచాలని అభ్యర్థించారు. గత ఐదేళ్లూ జరిగిన విధ్వంసంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయింనందున తక్షణం సాయం అందించాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలో రెండో రోజు కూడా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కూడా కలిశారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై నిర్మలా సీతారామన్కు మెమోరాండం అందజేశారు. నిధుల కేటాయింపు పెంచాల్సిన ఆవశ్యకతను అందులో వివరించారు. ప్రాజెక్టులకు నిధులు అందించాలని కోరారు. ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేంతవరకూ చేయూతనివ్వాలని ఆమెను కోరారు. విభజన తర్వాత రుణాలపై వడ్డీ పేరుకుపోయిందని.. అదనపు రుణాలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం పూర్తి చేసేందుకు నిధుల మంజూరుకు త్వరలో ఆమోద ముద్ర వేయాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటిలో 90 శాతం గ్రాంట్ ఇవ్వాలన్నారు. సీఎం వినతులపై ఆమె సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి ఆర్థిక భరోసా అందించేందుకు హామీ ఇచ్చారు. రాజ్నాథ్, జేపీ నడ్డాతో భేటీ సందర్భంగా కూడా పోలవరం నిర్మాణాన్ని పునఃప్రారంభించేందుకు కేంద్రం త్వరగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. రాజధానిలో మౌలిక వసతులు, ప్రభుత్వ భవన సముదాయాలను పూర్తి చేసేందుకు సాయం అందించాలని కోరారు. జీతాలు, పింఛన్లు, అప్పుల చెల్లింపుల వంటి ఖర్చులు రాష్ట్ర రెవెన్యూ వసూళ్లను మించిపోయాయని వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు ఆయనకు హామీ ఇచ్చారు. ఏపీలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాను కోరారు. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా చంద్రబాబు కలిసి రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa