విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ స్వాగతించారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కమిటీలు వేస్తున్నాయని.. గతంలోనే కేంద్రం హై లెవల్ కమిటీ వేసిందన్న భరత్.. కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా? అని ప్రశ్నించారు. కేంద్రం జోక్యం లేకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం పట్ల ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.ఇద్దరు సీఎంలు విభజన హామీల గురించి మాట్లాడింది తక్కువన్న భరత్.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వీరిద్దరూ భేటీ అయ్యారేమోననే అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీ పోర్టుల్లో తెలంగాణ వాటా అడుగుతుందని.. టీటీడీలోనూ తెలంగాణ వాటా అడుగుతోందనే వార్తలొచ్చాయన్న ఆయన.. ఈ వార్తలను ఎవరూ ఖండించలేదన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ బాగుపడిందనడంలో ఎలాంటి సందేహం లేదన్న భరత్.. అయితే ఏపీకి తెలంగాణ నుంచి ఇప్పటికీ వందకుపైగా ఆస్తులు రావాల్సి ఉందన్నారు. వీటి విలువ లక్షన్నర కోట్ల పైమాటేనన్నారు. గతంలో జగన్ డిమాండ్తో విభజన హామీల పరిష్కారం కోసం కేంద్రం షీలా బేడీ నేతృత్వంలో హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారన్న భరత్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆహ్వానించకపోవడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఇవాళ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే.. దానికి నూటికి 99 మార్కులు పవన్ కళ్యాణ్కు ఇవ్వాలన్నారు. పవన్ లేకుండా నిన్నటి సమావేశం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ను కూడా ఈ సమావేశానికి తీసుకెళ్లి ఉంటే మరింత బాగుండేదని మాజీ ఎంపీ అభిప్రాయపడ్డారు.
ఏపీకి తెలంగాణ నుంచి రూ.7,200 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందన్న మార్గాని భరత్.. భద్రాచలం వద్ద 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతారనే వార్తలొచ్చాయన్నారు. వీటిని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టం కాలపరిమితి పదేళ్లు మాత్రమేనన్న భరత్.. దాన్ని మరో పదేళ్లపాటు పొడిగిస్తే బాగుంటుందన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎంపీలెవరూ ఈ విషయమై మాట్లాడలేదన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి ప్రెస్ మీట్ పెట్టుంటే బాగుండేదన్న భరత్.. మీడియాలో వస్తున్న వార్తలపై ఇరు ప్రభుత్వాలు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ భేటీలో విభజన హామీల కంటే ఎక్కువగా రవాణా, డ్రగ్స్ స్మగ్లింగ్కు సంబంధించి చర్చ జరిగిందని తనకు తెలిసిందన్నారు.
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల పట్ల మార్గాని భరత్ స్పందించారు. తాను తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. శివ మాల వేసుకున్న ఎమ్మెల్యే గుడికి కూడా రాలేనంత బిజీగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘‘నువ్వు ఎమ్మెల్యేవయి నెల రోజులు కూడా కాలేదు.. 175 మంది ఎమ్మెల్యేల్లో నువ్వు ఒకడివి. కానీ ఓ సీఎంలా డిప్యూటీ సీఎంలా మాట్లాడుతున్నావ్. తమరి బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ చరిష్మాతో నువ్వు గెలిచావ్. ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే.. టీడీపీ అధికారంలో రావడానికి కారణం పవన్ కళ్యాణ్. ఆయనకు టీడీపీ వాళ్లంతా గుడికట్టి పూజ చేయాలి. ఆయన లేకపోతే మీరు అధికారంలో రాలేరు. చంద్రబాబు ఇచ్చిన అలవికాని అబద్ధపు బూటకపు హామీలకు ప్రజలకు ఆశపడ్డారు. ఇవన్నీ చూసి ప్రజలు ఓటేశారు. కానీ నీ ఫేస్ చూసి కాదు. నువ్వెవరో కూడా రాజమండ్రిలో సరిగా తెలీదు’’ అని మార్గాని భరత్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa