ఈ ప్రకృతిలో నిత్యం అనేక అరుదైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి ఘటనకూ ఓ కారణం ఉంటుంది. ఆస్తికులేమో అది దేవుడి మహత్యం అంటుంటారు. నాస్తికులైతే.. దానికి ప్రకృతి ధర్మం అని పేరు పెడుతారు. ఎవరు ఎలా అనుకున్నా , ఏమనుకున్నా కానీ.. ఈ ప్రపంచంలో ప్రతి ఘటన వెనుక ఓ అదృశ్య శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఆ అదృశ్య శక్తిని దేవుడైనా అనుకోవచ్చు.. లేదా శాస్త్రమని అనైనా భావించవచ్చు. ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో అలాంటి ఓ అపురూపమైన, అరుదైన ఘటన జరిగింది. శివయ్య సన్నిధిలో జరిగిన ఈ ఘటన.. అక్కడకు వచ్చిన భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. శివనామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయేలా చేసింది.
నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీశైలానికి భక్తులు భారీగా వస్తుంటారు. నిత్యం శివనామస్మరణతో, శివయ్య భక్తులతో ఈ ప్రాంతమంతా కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే శ్రీశైలంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ వద్ద ఉన్న చంద్రలింగాన్ని నాగుపాము అలంకరించింది. శివలింగాన్ని చుట్టుకుని భక్తులకు దర్శనమిచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు. అంతా స్వామివారి మహిమేనంటూ సంతోషం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఫోన్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉండటంతో అప్పడప్పడూ శ్రీశైలం ఆలయ పరిసరాల్లోకి పాములు, చిరుత పులులు, ఎలుగుబంట్లు వంటి జంతువులు వస్తుంటాయి. ఈ పాము కూడా అలాగే వచ్చిందని భావిస్తున్నారు. అయితే అడవిలో నుంచి వచ్చిన పాము.. శివలింగాన్ని చుట్టుకోవడమే ఇప్పుడు విశేషంగా మారింది. అది కూడా ఏకాదశి పండుగ వేళ ఇలా జరగడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అంతా శివయ్య మహిమేనని.. అందుకే నాగుపాము వచ్చి లింగాన్ని చుట్టుకుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అద్భుతమైన దృశ్యాన్ని చూశామని.. అక్కడికి వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa