రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. వర్షాలు అధికంగా కురుస్తున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాలలో నెలకొన్న తాజా పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదలపై ఎప్పటికప్పడు నివేదికలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. మరోవైపు ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 244 మి.మీ. వర్షపాతం నమోదైందన్న చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా 31 శాతం అదనపు వర్షపాతం కురిసిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారం జరిపిన ఇసుక, మట్టి తవ్వకాల కారణంగానే మట్టికట్టలు బలహీనపడ్డాయన్న చంద్రబాబు.. వాటి మీద దృష్టిపెట్టాలని అన్నారు.
విపత్తులు వచ్చినప్పుడే అధికారుల సమర్థత బయటపడుతుందన్న సీఎం చంద్రబాబు.. అధికారులు అందరూ డైనమిక్గా పనిచేయాలని సూచించారు. వర్షాలు, వరదలు వచ్చిన తరువాత కాకుండా ముందుగానే పరిస్థితులను అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించగలుగుతామని సూచించారు. మరోవైపు ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక సీఎం ఆదేశాలతో హోం మంత్రి వంగలపూడి అనిత కూడా వర్షాలపై అధికారులపై చర్చించారు. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో తాజా పరిస్థితులపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa