ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరిపోయారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో వీరంతా సైకిలెక్కారు. మరో వారంలో మరికొంత మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీ, జనసేన పార్టీల్లోకి చేరతారని కూటమి నేతలు తెలిపారు. ఈ నెల 23 లేదా 24వ తేదీన వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారని జనసేన వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం కార్పొరేటర్లే కాదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వైసీపీని వీడి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ గంటా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గేట్లు ఓపెన్ చేస్తే.. వైసీపీ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రవర్తన నచ్చకే చాలా మంది ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని గంటా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరినప్పటికీ టీడీపీకి ఇప్పుడే వైజాగ్ మేయర్ పీఠం దక్కే అవకాశం లేదు.
విశాఖపట్నం గ్రేటర్ కార్పొరేషన్లో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీకి 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇక టీడీపీకి 27 మంది, జనసేనకు ముగ్గురు, బీజేపీకి ఒక కార్పొరేటర్, మరో ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు ఉన్నారు. వీటితో పాటుగా గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పరిధిలో టీడీపీ కూటమికి 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మొత్తం కలిపితే కూటమి మద్దతు 45 గా ఉంటుంది. వీరికి మరో ఐదుగురు కార్పొరేటర్ల మద్దతు ఉంటే టీడీపీ కూటమిదే మెజారిటీ. అయితే కౌన్సిల్లో పటిష్టంగా ఉండాలనే ఆలోచనలో ఉన్న టీడీపీ వైసీపీ నుంచి కార్పొరేటర్లను చేర్చుకుంటోంది.
అయితే వైసీపీ నుంచి కార్పొరేటర్లను చేర్చుకున్నా సరే ఇప్పటికిప్పుడు టీడీపీకి మేయర్ పీఠం సొంతం కాదు. ఎందుకంటే మేయర్ లేదా మున్సిపల్ ఛైర్మన్ పదవుల్లో ఉన్నవారిపై నాలుగేళ్ల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా చట్టం చేశారు. ఈ నేపథ్యంలో మేయర్ పదవిని టీడీపీ కూటమి చేజిక్కించుకోవాలంటే ఈ చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి టీడీపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఈ చట్టానికి సవరణ చేస్తుందా లేదా నాలుగేళ్ల పాటు సైలెంట్గా ఉంటుందా చూడాలి మరి. అయితే ఈలోపే జీవీఎంసీలోని స్టాండింగ్ కమిటీలను చేజిక్కించుకోవాలని టీడీపీ కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారు.
వంకం వెంకటరమణ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa