విశాఖ పరిధిలోని అక్కిరెడ్డిపాలెం జంక్షన్లో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో అందులో ఉన్న డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. అక్కిరెడ్డిపాలెం జంక్షన్లోని జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం లోడుతో వెళ్తున్న ఓ లారీకి బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన నిలిపివేశారు. కాగా సాయంత్రం ఐదు గంటల సమయంలో షీలానగర్ నుంచి గాజువాక వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అక్కిరెడ్డిపాలెం కూడలికి వచ్చేసరికి వెనక వస్తున్న కారుకు సైడ్ ఇచ్చేందుకు యత్నించే క్రమంలో ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొంది. దీంతో బొగ్గు లోడుతో ఉన్న లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న డ్రైవర్ తేజేశ్వరరావు ఇంజన్లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో గాజువాక నుంచి నగరం వైపు కారులో వస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రమాద దృశ్యాన్ని చూసి ఆగి 108కు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికులతో పాటు అక్కడున్న లారీ డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవరును బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. లారీలో తీవ్ర గాయాలతో ఉన్న తేజేశ్వరరావుకు 108 వాహన సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. ఎక్స్కవేటర్ సాయంతో సుమారు గంటపాటు శ్రమించి ఆయనను బయటకు తీశారు. డ్రైవరుకు రెండు కాళ్లు విరిగిపోవడంతో పాటు నడముకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa