రాష్ట్రంలో పేదలకు శుభవార్త. వారికి గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలివ్వాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత జగన్ ప్రభుత్వం గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు చొప్పున ఇచ్చి ఊరూవాడా డబ్బా కొట్టుకుంది. ఎన్నికల్లో అయితే భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు దానికి రెట్టింపు ఇవ్వాలని నిశ్చయించడం విశేషం. సోమవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతి కల్పించాలని లక్ష్యం విధించారు. రానున్న వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాల్లో కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లు నిర్మించాలని నిర్దేశించారు. దీనికి తగినట్లుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎం సమీక్ష తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సర్కారు ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని భూముల్లో ఇళ్లస్థలాలు పొందని పేదలకు కూడా 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిశ్చయించాం. జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాతంతో వ్యవహరించి పూర్తయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదు. ఇటువంటి బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని సీఎం ఆదేశించారు’ అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa