శ్రీశైలం జలాశయంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.. లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్ కింద వరద నీటిలో మునిగిపోయాడు. నల్లగొండ జిల్లా వెంకటాపురానికి చెందిన చొప్పరి యాదయ్య హమాలీగా పనిచేస్తున్నాడు.. ఆయన శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనార్థం స్నేహితులతో కలిసి వచ్చారు. శ్రీశైలం జలాశయం దగ్గర స్నానానికి వెళ్లిన యాదయ్య వరదలో కొట్టుకుపోయాడు. ప్రాజెక్టులో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఎవరూ అతడ్ని కాపాడే సాహసం చేయలేకపోయారు.. అతడు అందరూ చూస్తూ ఉండగానే నీటిలో గల్లంతయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. యాదయ్య కోసం గాలింపు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు శ్రీశైలం జలశయానికి ఎగువ నుంచి వరద పెరగడంతో.. 10 గేట్లను 18 అడుగుల మేర పైకెత్తారు. మొత్తం 4,31,370 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదులుతున్నారు.. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రాలకు మరో 60,232 క్యూసెక్కుల ప్రవాహం విడుదల చేస్తున్నారు. ఎగువనున్న జూరాల ప్రాజెక్టు నుంచి 3,16,639 క్యూసెక్కులు.. సుంకేశుల నుంచి 1,47,380 క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 883.80 అడుగులు ఉంటే.. నీటినిల్వ 208.7210 టీఎంసీలుగా ఉంది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.. ప్రాజెక్టులో వరద ఇన్ ఫ్లోను బట్టి కిందకు నీటిని విడుదల చేస్తు్నారు.
ఇటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా వరదతో వేగంగా నిండుతోంది. గురువారం సాయంత్రానికి సాగర్ పూర్తిస్థాయి నిల్వ 312.05 టీఎంసీలు కాగా.. 182.95 టీఎంసీలకు చేరింది. అలాగే పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది.ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి 1,97,468 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. జలాశయంలో ప్రస్తుతం 1631.22 అడుగులకు గాను 98.73 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ఇన్ ఫ్లో దృష్టిలో ఉంచుకొని కాల్వలకు, నదికి 1,78,851 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa