ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు.. అందరి నుంచి సూచనలు తీసకున్న తర్వాత మాజీ మంత్రి బొత్స పేరును వైఎస్ జగన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ నుంచి పలువురు నేతలు ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కోలా గురువులు పేర్లు కూడా వినిపించాయి.. కానీ అధినేత జగన్ మాత్రం బొత్స వైపు మొగ్గు చూపారు.
విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో 2021 డిసెంబరులో రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కళ్యాణిలు ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. వీరిలో వంశీకృష్ణ గతేడాది నవంబరులో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో.. శాసనమండలి ఛైర్మన్ వంశీకృష్ణ శ్రీనివాస్ను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంకాగా.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
విశాఖపట్నం ఎమ్మెల్స ఉప ఎన్నికకు ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 13 నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. ఆగస్టు 14న నామినేషన్ల పరిశీలన.. ఆగస్టు 16 ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. అనంతరం ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు.. సెప్టెంబరు 6తో ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఎలాంటి ప్రారంభోత్సవాలు, మంత్రుల అధికారిక సమీక్షలు నిర్వహించకూడదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇక టీడీపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.. ఆ పార్టీ నుంచి గండి బాబ్జీ రేసులో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa