ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఆశ్రమంలో ఏం జరుగుతోంది,,,20 రోజుల్లో 14 మంది చిన్నారుల మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 02, 2024, 09:54 PM

ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఆశ్రమంలో గత 20 రోజుల్లోనే ఆ ఆశ్రమంలో ఉన్న 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం పెను సంచలనంగా మారింది. అందులో ఎక్కువమంది మానసిక వికలాంగులే ఉండటం మరింత తీవ్రంగా బాధిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు అక్కడ చనిపోయిన వారి సంఖ్య 27కు పెరగడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ సర్కార్.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది.


దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో ఆశా కిరణ్ పేరుతో మానసిక వికలాంగుల ఆశ్రమం ఉంది. ఇప్పుడు ఈ ఆశ్రమంలోనే వరుసగా చిన్న పిల్లలు చనిపోతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆశ్రమంలో గడిచిన 20 రోజుల్లోనే 14 మంది చిన్నారులు మృతి చెందడం తీవ్రంగా కలవరపెడుతోంది. అయితే చనిపోయినవారిలో ఎక్కువ మంది మానసిక వికలాంగులే ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 27 మంది చిన్నారులు చనిపోయారు. అయితే ఈ మరణాలన్నింటికీ కారణాలు ఏంటో తెలియకపోవడం మరింత సంచలనంగా మారింది.


  ఇక చిన్నారుల మరణాలపై వార్తలు రావడం, ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలతో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టకేలకు స్పందించింది. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఢిల్లీ మంత్రి అతిషీ మార్లేనా స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం షాక్‌కు గురిచేసిందని మంత్రి అతిషీ పేర్కొన్నారు. ఇలాంటి నిర్లక్ష్యాలను సహించేది లేదని.. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 48 గంటల్లోగా ఆ మరణాలపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి అతిషి ఆదేశించారు.


మరోవైపు.. ఈ చిన్నారుల మృతుల అంశాన్ని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ తీవ్రంగా పరిగణించారు. ఇప్పటికే నిజనిర్ధరణ బృందాన్ని ఆ ఆశా కిరణ్ ఆశ్రమానికి పంపించినట్లు చెప్పారు. ఇక ఈ ఘటనపై ఆందోళనకు దిగిన ప్రతిపక్ష బీజేపీ నేతలు.. ఆశ్రమం ముందు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే ఆశ్రమంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆశ్రమంలోని పిల్లలకు మంచి నీరు కాకుండా మురికి నీరు అందుతోందని.. వారికి ఆహారం, చికిత్స కూడా సరిగా అందడం లేదని బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa