ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంటిపిల్ల తల్లులకు ఇక నుంచి ఆ సమస్య ఉండదు,,, రైల్వేశాఖ గుడ్‌న్యూస్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 02, 2024, 09:57 PM

ఎన్నో దశాబ్దాల నుంచి దేశంలో ప్రయాణికులు, సరుకు రవాణాకు రైల్వేలే ప్రధాన వాహకాలుగా పనిచేస్తున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వేలు అభివృద్ధి చెందుతున్నాయి. విలాసవంతమైన రైళ్లే కాకుండా, వేగంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రయాణికులు ఎక్కువగా రైళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వందే భారత్ రైళ్లు ఇప్పటికే పట్టాలపై పరుగులు పెడుతుండగా.. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు, బుల్లెట్ రైళ్లు, హైడ్రోజన్ రైళ్లు.. ఇలా భారతీయ రైల్వేలు ఆధునిక టెక్నాలజీని అందుకోనున్నాయి. మరోవైపు.. ఇప్పటివరకు ఉన్న రైళ్లలో కూడా కేంద్రం అనేక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే చంటిపిల్ల తల్లులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది.


ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్లలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్న రైల్వేశాఖ.. అందులో భాగంగానే ప్రయోగాత్మకంగా బేబీ బెర్తులను తీసుకువచ్చామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా రాజ్యసభలో వెల్లడించారు. చిన్న పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ బేబీ బెర్తులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ట్రైన్‌ కోచ్‌లలో బేబీబెర్త్‌లను అమర్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందా అని బీజేపీ ఎంపీ సమర్ సింగ్ సోలంకీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు.


లఖ్‌నవూ మెయిల్‌లో రెండు బేబీ బెర్త్‌లను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చినట్లు అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. లఖ్‌నవూ మెయిల్‌లోని ఒక కోచ్‌లో 2 దిగువ బెర్త్‌లకు బేబీ బెర్తులను అమర్చినట్లు స్పష్టం చేశారు. ఈ బేబీ బెర్తులపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో రైల్వే శాఖపై ప్రయాణికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తినట్లు చెప్పారు. అయితే ఈ బేబీ బెర్తుల ఏర్పాటు వల్ల సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం.. సీట్ల మధ్య దూరం తగ్గడం వంటి కొన్ని సమస్యలు తమ దృష్టి వచ్చినట్లు చెప్పారు. ప్యాసింజర్ కోచ్‌లలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయని.. అది నిరంతర ప్రక్రియ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.


బేబీ బెర్తులు.. చిన్న పిల్లల కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ చిన్నపాటి పడకలు.. లోయర్‌ బెర్త్‌కు అటాచ్‌ అయి ఉంటాయి. రైళ్లలో ప్రయాణించే సమయంలో చంటి పిల్లల తల్లులు.. వారిని ఈ బేబీ బెర్త్‌పై పడుకోబెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న బెర్తుల ప్రకారం అయితే ఒకే బెర్త్‌పై తల్లీ, పిల్లలు పడుకుని ఇరుకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో స్థలం సరిపడక.. చంటి పిల్లలు, తల్లులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఇప్పుడు బేబీ బెర్త్‌ సాయంతో పిల్లల్ని.. వారి తల్లులు తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టుకునే అవకాశం లభించింది. అయితే ఈ బేబీ బెర్తులు అవసరం లేనప్పుడు.. దాన్ని మడిచి లోయర్‌ బెర్త్‌ కిందికి పంపించవచ్చు. శిశువును సురక్షితంగా ఉంచడానికి పట్టీలూ ఉన్నాయని గతంలో అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa