వైసీపీ ప్రభుత్వ హయాంలో తగ్గించిన అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిని మళ్లీ పెంచాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధాని అమరావతి పరిధిలోకి బాపట్ల, పల్నాడు ప్రాంతాలు కూడా చేరనున్నాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం విజయవాడ, గుంటూరును కలుపుతూ రాజధానికి ప్రణాళిక రూపొందించింది. అయితే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన జిల్లాల విభజనలో గుంటూరు జిల్లా నుంచి కొత్తగా బాపట్ల, పల్నాడును జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా 8352,69 చదరపు కిలోమీటర్లుగా ఉన్న రాజధాని పరిధిని..6993.24చదరపు కిలోమీటర్లుకు తగ్గించింది.
అయితే శుక్రవారం సీఆర్డీఏ అధికారులతో సమావేశం అయిన చంద్రబాబు.. రాజధాని పరిధిని పెంచాలని నిర్ణయించారు. గతంలో ఎంత నిర్ణయించామో అంతే కొనసాగించాలని సూచించారు. దీంతో పల్నాడు, బాపట్ల ప్రాంతాలు రాజధాని పరిధిలోకి రానున్నాయి. దీంతో అమరావతి రాజధాని పరిధి పెరగనుంది. మరోవైపు ఈ సమావేశంలో 12 అంశాలపై చర్చ జరిగింది. రాజధాని ప్రాంతంలో గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులపై చంద్రబాబు చర్చించారు. భూమి కేటాయించిన సంస్థల అభిప్రాయాలను తెలుసుకుని, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే సంస్థలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. అలాగే భూములు పొందిన సంస్థలు ఎన్ని రోజుల్లో నిర్మాణాలు జరపాలనే దానిపై చర్చించారు. భూములు పొందిన సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు మరో రెండేళ్లు గడువు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దేశవ్యా్ప్తంగా ఉన్న టాప్ టెన్ పాఠశాలలు, కాలేజీలు, ఆస్పత్రులు అమరావతిలో ఏర్పాటు అయ్యేలా చూడాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే అమరావతిని అనుసంధానం చేసేలా కృష్ణా నదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జిలు కూడా నిర్మించేలా ప్రణాళిక రచిస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. వీటితో పాటుగా 9 థీమ్ నగరాల నిర్మాణం కొనసాగుతుందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏలోకి 778 మంది ఉద్యోగులను తీసుకుంటామన్న నారాయణ.. 32 మంది కన్సల్టెంట్లను కూడా నియమించుకుంటామని చెప్పారు. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లోకి కలిపిన నాలుగు గ్రామాలను కూడా అమరావతి రాజధాని పరిధిలోకి తీసుకుంటామని నారాయణ వెల్లడించారు.
మరోవైపు రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వంతో తిరిగి మాట్లాడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే పూర్తైన నిర్మాణాలకు సంబంధించి ఐఐటీ నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా ముందుకెళ్తామని చెప్పారు. హైవేకి సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానం చేస్తామని, రాజధాని పరిధి చివరి వరకూ నాలుగు లైన్ల కరకట్ట రోడ్డు ఉంటుందని వివరించారు. రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డుతో పాటుగా వెస్ట్రన్ బైపాస్ ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa