దేవభూమి కేరళ వయనాడ్పై ప్రకృతి చూపించిన ప్రకోపానికి మృతుల సంఖ్య ఇప్పటికి 300 దాటింది. మరో 200 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన పెను విధ్వంసం.. గ్రామాలనే తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. అయితే ఈ విపత్తు గురించి.. ఓ చిన్నారి ఏడాది క్రితం రాసిన కథ ప్రస్తుతం బయటికి వచ్చింది. అచ్చం ఆ స్కూల్ విద్యార్థిని రాసిన ఆ కథలో జరిగినట్లుగానే ప్రస్తుతం వయనాడ్లోనూ అలాంటి పరిస్థితే రావడం గమనార్హం. అయితే ఆ స్టోరీని బెస్ట్ స్టోరీగా ఎంపిక చేసిన ఆ స్కూల్ యాజమాన్యం.. దాన్ని అప్పట్లో స్కూల్ మేగజైన్ మీద ప్రింట్ చేసింది. తాజాగా వయనాడ్లో కొండ చరియలు విరిగిపడటం వల్ల తలెత్తిన విధ్వంస పరిస్థితుల నేపథ్యంలో ఆ స్టోరీ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఆ స్టోరీ చివర్లో అంతా హ్యాపీగా సాగితే.. రియల్ స్టోరీలో మాత్రం వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
వయనాడ్ జిల్లాలోని గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్న లయ అనే బాలిక రాసిన కథ ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. జలపాతంలో మునిగిపోయే అమ్మాయి గురించి గతేడాది స్కూల్లో నిర్వహించిన పోటీల్లో లయ రాసిన ఆ స్టోరీకి ప్రశంసలు వెల్లువెత్తాయి. దీంతో ఆ స్టోరీని పోయిన సంవత్సరం స్కూల్ మేగజైన్లో కూడా ప్రచురించారు. జలపాతంలో మునిగిపోవడం వల్ల ఓ అమ్మాయి మరణిస్తుంది. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి పక్షిగా మారి.. తిరిగి అదే గ్రామానికి తిరిగి వస్తుంది.
ఆ పక్షి ఆ ఊరి పిల్లలతో ఇలా చెబుతుంది. "పిల్లలారా, ఈ ఊరి నుంచి పారిపోండి. ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతోంది" అని పేర్కొనడంతో.. ఆ పిల్లలంతా వెనక్కి తిరిగి చూసేసరికి కొండపై నుంచి భారీగా వర్షపు నీరు, మట్టి, బురద వేగంగా ఆ గ్రామం వైపు దూసుకొస్తుంది. ఆ తర్వాత ఆ పక్షి అందమైన అమ్మాయిగా మారుతుంది. అయితే ఆ గ్రామస్తులను రక్షించడానికి ఎవరూ రాకపోవడంతో వారు మునిగిపోతారు.
వయనాడ్ జిల్లాలోని చురల్మల ప్రాంతం ప్రస్తుతం కొండచరియలు సృష్టించిన విధ్వంసంలో మునిగిపోయింది. అయితే లయ.. ఈ దుర్ఘటనలో తన తండ్రి లెనిన్ను కోల్పోవడం తీవ్ర బాధాకరంగా మారింది. ఇక లయ చదువుకున్న పాఠశాలలో మొత్తం 497 మంది విద్యార్థులు ఉండగా.. అందులో 32 మంది ప్రకృతి బీభత్సానికి బలయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు వారి తండ్రి, అక్కాచెల్లెల్లను కోల్పోయారు. ఇక లయ చదువుకునే పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ వి ఉన్నికృష్ణన్, ఇతర ఉపాధ్యాయులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఆ స్కూల్లో పాఠాలు చెప్పే ఐదుగురు ఉపాధ్యాయులు చురల్మలలో అద్దె గదిలో ఉంటున్నామని తెలిపారు. తాము స్కూల్లోనే ఉంటే ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్లమని టీచర్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa