అయోధ్య వివాదంపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తోన్న నేపథ్యంలో మోదీ సర్కారు కీలక ముందడుగు వేసింది. వివాదాస్పద స్థలం మినహా అక్కడ 67.39 ఎకరాల భూమిని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు కోరింది. అంతేకాదు, దీనికి అనుగుణంగా గతంలో తీర్పును సవరించాలని విన్నవించింది. లోక్సభ ఎన్నికల ముందు హిందూ ట్రస్టుతో పాటు ఇతరులకు ఈ భూముల్ని అప్పగించేందుకు పావులు కదుపుతోంది. కరసేవకులు 1992 డిసెంబరు 6న కూల్చివేసిన బాబ్రీ మసీదుతో పాటు దాని చుట్టూ ఉన్న 67.703 ఎకరాల భూమిని 1993లో చట్టం ద్వారా ప్రభుత్వం సేకరించింది. ఇందులోని 42 ఎకరాలు ‘రామ జన్మభూమి న్యాస్’ పేరిటే ఉన్నాయని, మసీదు కూల్చివేతకు ముందు 2.77 ఎకరాల విస్తీర్ణంలో వివాదాస్పద కట్టడం ఉన్న విస్తీర్ణం కేవలం 0.313 ఎకరాలేనని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది.
కాబట్టి, దీనిని మినహాయించి, మిగతా భూముల్ని అప్పగించడానికి అనుమతించాలని కోరింది. కేంద్ర ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపితే హిందూ సంస్థలు ఆ భూముల్లో రామాలయాన్ని నిర్మించడానికి వీలుంటుందనే భావన వ్యక్తమవుతోంది. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి కేంద్రం పూనుకోవాలని, అవసరమైతే ఆర్డినెన్స్ జారీచేసైనా మందిరాన్ని నిర్మించాలని ఆరెస్సెస్ సహా పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయోధ్యలో ఆలయాన్ని న్యాయబద్దంగా నిర్మిచాలనేది తమ ఉద్దేశమంటూ పలు సందర్భాల్లో వెల్లడించిన బీజేపీ, ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అయోధ్య స్థలంపై ప్రభుత్వ చర్య సరైన అడుగు అని విశ్వహిందూ పరిషత్ వ్యాఖ్యానించింది.
వివాద రహిత స్థలం రామజన్మభూమి న్యాస్కు చెందుతుందని, మందిర నిర్మాణానికి ఆ స్థలాన్ని అప్పగించాలని ఆ సంస్థ ఎప్పటినుంచో కోరుతోందని వీహెచ్పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్కుమార్ అన్నారు. అయితే కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఎన్నికల ముందు మోదీ సర్కారు డ్రామాలాడుతోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గత 16 ఏళ్లుగా ఈ స్థలంపై కొనసాగుతోన్న యథాతథ స్థితిని మార్చాలన్న కేంద్రం అభ్యర్థన పట్ల తమ అభిప్రాయాన్ని వెల్లడించలేమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు సంఘ్ పరివార్ను బుజ్జగించే చర్యని, సుప్రీంకోర్టును ప్రభావితం చేసే ప్రయత్నంగా సీపీఎం ఆరోపించింది. బాబ్రీ మసీదు వివాదంపై నిష్పాక్షిక విచారణ జరగకుండా వంచనతో ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కాగా, కేంద్రం విన్నపాన్ని సుప్రీంకోర్టు ఏమేరకు పరిగణనలోకి తీసుకుంటుదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికి బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీ విసిరిన బాణం ఏ మేరకు ఓట్లు తెచ్చిపెడుతుందో? లేదో మరి ఎన్నికల్లో తేలిపోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa