రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మునిసిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే పనులు ఈరోజు నుంచి మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంపలను నెలరోజుల్లోగా తొలగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన వస్తుందన్న మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణాలు జరిపే చోట, ఎల్పీఎస్ ఇన్ఫ్రా జోన్లు, ట్రంక్ ఇన్ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ల కంపలను తొలగించనున్నారు. కాగా.. గత ఐదేళ్లుగా అమరావతిలో కట్టడాలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అమరావతిలో జంగిల్ దట్టంగా పేరుకుపోయింది. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా అమరావతి రాజధాని విధ్వంసంతో భారీ నష్టం సంభవించడంతో పాటు నష్ట నివారణ కోసం ఏ పని చేయాలన్నా ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి మంచి రోజులు వచ్చాయి. రాజధానిని అభివృద్ధి చేయడంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. ప్రస్తుతం అమరావతిలో పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు. పెరిగిన పిచ్చి చెట్లు, కంపలను తొలగించాల్సి ఉంది. ఇందు కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa