బంగ్లాదేశ్లో తాజాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అధ్యక్షతన.. రేపు బంగ్లాదేశ్లో తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ వెల్లడించారు. మహ్మద్ యూనస్ మంత్రివర్గంలో 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రాత్రి 8 గంటలకు బంగ్లాదేశ్లో కొత్తగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ మీడియాకు తెలిపారు. మహ్మద్ యూనస్ సలహా మండలిలో 15 మంది సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. ఇక షేక్ హసీనా.. పదవి నుంచి తప్పుకున్న తర్వాత.. మహ్మద్ యూనస్ను మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ మంగళవారం ఎంపిక చేశారు. ఇక బంగ్లాదేశ్లోని విద్యార్థి సంఘాలు కూడా మహ్మద్ యూనస్కే పగ్గాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక 84 ఏళ్ల మహ్మద్ యూనస్.. 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలెడోనియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా పనిచేశారు. అంతేకాకుండా చిట్టగాంగ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా కూడా సేవలు అందించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతికి మహ్మద్ యూనస్ ఎననలేని కృషి చేశారు. 1940లో చిట్టగాంగ్లో పుట్టిన మహ్మద్ యూనస్.. ఒక సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థిక వేత్తగా ఉన్నారు. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా బంగ్లాదేశ్లోని లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన సేవలకు గానూ 2006లో నోబెల్ బహుమతి వరించింది. అయితే బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే.. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న ఘర్షణలు ఆగుతాయని సైన్యం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa