ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాయితీ రుణాలపై కీలక ముందడుగు వేసింది. కేంద్ర పథకం అయిన పీఎం అజయ్ని అనుసంధానించి.. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు 50 శాతం లేదా గరిష్ఠంగా రూ.50 వేలు రాయితీ కింద రుణాలు అందించాలని నిర్ణయించింది. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. మూడేళ్లలో రాయితీ విడుదలకు కేంద్రం రూ.151 కోట్లు ఇస్తుంది.. ప్రస్తుతం 100 రోజుల ప్రణాళికలో భాగంగా 1500 మందికి రుణాలు అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రతి నియోజకవర్గం నుంచి నిర్దేశించిన మేర లబ్ధిదారులు ఉండేలా చూస్తున్నారు అధికారులు.. మూడేళ్లపాటు ఆ తర్వాత నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రూ.50 వేల రాయితీ పోనూ రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు తీసుకునే రుణంలో మిగతా మొత్తంపై వడ్డీ భారం లేకుండా చేస్తోంది. దీని కోసం పీఎం అజయ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఉన్నతి పథకానికి అనుసంధానించాలని నిర్ణయం తీసుకుంది. అంటే రాయితీ పోనూ మిగతా రుణ మొత్తాన్ని ఉన్నతి కింద అందిస్తారు..అలాగే ఈ రుణం మొత్తానికి వడ్డీ కూడా ఉండదు.
ఈ రుణాలను తీసుకున్న లబ్ధిదారులు నిర్దేశిత మొత్తాన్ని నెల వారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.లక్ష వరకు తీసుకుంటే రూ.50 వేలు రాయితీ పోనూ మిగతా రూ.50 వేలను 36 నెలల్లో కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రుణాలతో ఆటో కొనేందుకు ఈ పథకాన్ని వినియోగించుకుంటే 60 నెలల్లో వాయిదా చెల్లించే వెసులుబాటు కూడా కల్పించారు. అలాగే వ్యవసాయానికి, చిన్న తరహా కుటీర పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటుకు దీన్ని వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. గతంలో రాయితీ రుణాలు దుర్వినియోగం అయ్యాయని.. తాజాగా అందించే రాయితీ మొత్తాన్ని మొదటే ఇవ్వాలా? లేదా నెల వాయిదాల్లో చివరగా మినహాయించాలా? అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఎస్సీ లబ్ధిదారుల పేరుతో ఇతర వర్గాల వారు రాయితీ రుణాలు పొందకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
అంతేకాదు డ్వాక్రా మహిళల కోసం బ్యాంకులతో మాట్లాడి డ్వాక్రా గ్రూపుల్లోని ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణంగా ఇప్పిస్తారు. అలాగే ఒకే సమయంలో సంఘంలో గరిష్ఠంగా ముగ్గురికి అందించే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు రూ.2 వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని టార్గెట్ పెట్టుకున్నారు సెర్ప్ అధికారులు. వీరిలో 1.35 లక్షల మందికి రూ.లక్ష మేర, 15 వేల మందికి రూ.5 లక్షల రుణాలను అందించాలని భావిస్తున్నారు. అంతేకాదు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. డ్వాక్రా గ్రూపుల్లో లబ్ధిదారుల ఆసక్తి, యూనిట్ ఏర్పాటు వ్యయానికి అనుగుణంగా రుణాన్ని భవిష్యత్తులో రూ.10 లక్షలకు కూడా పెంచుతామని చెబుతున్నారు అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa