ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజు గుడివాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి అన్న క్యాంటీన్ను పునఃప్రారంభించారు. అయితే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అన్న క్యాంటీన్లు (100) ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 99 అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు తొలిరోజు అన్న క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి 93 వేల మంది ఆహారం తీసుకున్నారు. వీరిలో అల్పాహారం 32,500, మధ్యాహ్న భోజనం 37,500, రాత్రి భోజనం 23,000 మంది చేశారని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువశాతం ప్రజలు అల్పాహారం, మధ్యాహ్న భోజనం సమయంలో అన్న క్యాంటీన్ల దగ్గర కనిపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో వీరికి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ చేతుల మీదుగా ఆహారం సరఫరా చేశారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం ఏర్పడకుండా అధికారులు అన్న క్యాంటీన్ల దగ్గర ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 100 క్యాంటీన్లలో లెక్కలు చూస్తే.. రోజూ సగటున 1.05 లక్షల ప్లేట్ల ఆహారం (అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం)పై రాష్ట్ర ప్రభుత్వం రూ.78.75 లక్షలు రాయితీగా అందిస్తోంది. అంటే నెలకు రూ.19.68 కోట్లు, ఏడాదికి రూ.236.25 కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం భరిస్తుంది.
ఏపీలో పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు 2018 జులైలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 183 క్యాంటీన్లు ప్రారంభించగా.. 2019 జులై వరకు 13 నెలలపాటు కొనసాగాయి. అప్పట్లో మొత్తం 4,60,31,660 మంది భోజనం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్నా సరే టీడీపీ నేతలు కొందరు పలు జిల్లాల్లో అన్న క్యాంటీన్లను నడిపించారు. అయితే ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు తిరిగి ఏర్పాటు చేస్తామని కూటమి ప్రకటించింది.. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.
గుడివాడ నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం.. సతీమణితో కలిసి భోజనం చేసిన చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా.. వచ్చే నెలాఖరుకు మరో 103 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 203 క్యాంటీన్లలో రోజూ 2.13 లక్షల మంది రోజూ అల్పాహారం, భోజనం చేస్తారని ప్రభుత్వం ఓ అంచనా వేస్తోంది. దీంతో రోజుకు రూ.1.59 కోట్ల చొప్పున.. నెలకు రూ.39.96 కోట్లు, ఏడాదికి రూ.479 కోట్ల రాయితీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది అంటున్నారు. అంతేకాదు అన్న క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు రిజిస్టర్ చేసిన అన్న క్యాంటీన్ ఛారిటబుల్ ట్రస్ట్ రెండు, మూడు రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. బ్యాంకు అకౌంట్, ఫోన్ పే, క్యూర్ కోడ్ ద్వారా ప్రజలు విరాళాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు విరాళాలు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa