భారత జట్టులోకి ఎంట్రీ, రీఎంట్రీ ఇవ్వాలనుకునే ప్లేయర్లను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్లో సత్తాచాటాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇది వరకే స్పష్టత ఇచ్చిన జైషా.. మరోసారి దీన్ని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా గాయలపాలై క్రికెట్కు దూరమైన వారు.. మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో ఆడాలని సూచించారు. ఆటగాళ్లు తమ ఫిట్నెస్ నిరూపించుకోవాలంటే.. అందుకు అత్యుత్తమ వేదిక డొమెస్టిక్ క్రికెట్ అని చెప్పుకొచ్చారు.
డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే నిబంధన నుంచి కొంత మంది ప్లేయర్లకు మినహాయింపు ఉంటుందని జైషా వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి వారి ఈ జాబితాలో ఉంటారని.. వారు కూడా అందరిలాగే.. దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరడంలో అర్థం లేదని జైషా అన్నారు.
‘ఇకపై భారత జట్టులోకి ఆటగాళ్ల ఎంపిక విషయంలో కాస్త కఠినంగా ఉందామని డిసైడ్ అయ్యాం. రెండేళ్ల క్రితం టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతడి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే ఫిట్నెస్ సాధించాడు. వాస్తవానికి అప్పుడు నేను జడేజాతో మాట్లాడా. దేశవాళీ క్రికెట్ ఆడమని కోరాను. కానీ ఇప్పుడు దాన్ని తప్పనిసరి చేశాం. ఆటగాళ్లు గాయాలకు గురైనా.. విరామం తీసుకుని మళ్లీ జాతీయ జట్టులోకి రావాలన్నా.. ఫిట్నెస్ నిరూపించుకోవాలి. అందుకు దేశవాళీ క్రికెట్ అనేది ఉత్తమ వేదిక’ అని జైషా అన్నారు.
‘తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధన నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలకు మినహాయింపు ఉంటుంది. ఇలాంటి అగ్రశ్రేణి క్రికెటర్లను దేశవాళీ క్రికెట్ ఆడాలని చెప్పలేం. ఎందుకంటే వారు అక్కడ ఆడుతూ గాయపడితే అది జట్టుకు నష్టాన్ని చేకూరుస్తుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి క్రికెట్ బోర్డులు సైతం టాప్ ఆటగాళ్ల విషయంలో ఇదే ఫాలో అవుతున్నాయి. మనం కూడా టాప్ ప్లేయర్లకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గాయపడ్డ ఇతర ఆటగాళ్లు మాత్రం.. వారి ఫిట్నెస్ నిరూపించుకునేందుకు కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందే’ అని బీసీసీఐ కార్యదర్శి జైషా తేల్చి చెప్పారు. బీసీసీఐ నిర్ణయం నేపథ్యంలో ఈసారి దులీప్ ట్రోఫీలో చాలా మంది స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ లాంటి ఆటగాళ్లు ఆయా జట్లలో భాగం అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa