ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుక కోసం వినియోగదారులు ఇబ్బంది పడొద్దని అభిప్రాయ పడింది. ఉచిత ఇసుక సరఫరా అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అధికారులతో సమీక్షించారు. ఇసుక సరఫరాలో ఫిర్యాదుల స్వీకరణ కోసం 1800-599-4599 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. సమస్య ఉంటే dmgapsandcomplaints@yahoo.comకు మెయిల్ చేయాలని సూచించారు. ఇకపై ప్రతిరోజు ఇసుక సరఫరా గురించి పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇసుక సరఫరాకు సంబంధించి ఐవీఆర్ఎస్ విధానంతో ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా. ఇసుక రవాణ ఛార్జీలను నోటిఫై చేయాలని అధికారులను ఆదేశించా. ఉచిత ఇసుక సరఫరాపై ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లు నివేదిక ఇవ్వాలి. ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణా కట్టడి చేసే బాధ్యత కలెక్టర్లదే. ఇసుక వినియోగదారుల బుకింగ్, రవాణా వ్యవస్థలను మరింత సులభతరం చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. స్టాక్ పాయింట్ల వద్ద రద్దీని నివారించాలి అని’ సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘రాష్ట్రంలో ఇసుక రవాణాకు సంబంధించి బుకింగ్ ఇన్వాయిస్ లేకుండా లారీలు స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్లకుండా కఠినంగా వ్యవహరించాలి. బుకింగ్ ఇన్వాయిస్ తనిఖీ కోసం స్టాక్ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. ఇసుక రవాణ ఛార్జీలు వినియోగదారునికి భారం కాకుండా చర్యలు తీసుకోవాలి. నోటిఫై చేసిన ఇసుక రవాణా ధర కంటే ఎక్కువ తీసుకున్న వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఇసుక సరఫరా, వస్తోన్న సమస్యలపై ప్రతి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి అని’ సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa