ఒంగోలులో ఎయిర్పోర్టుతోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో గురువారం ఎమ్మెల్యే జనార్దన్తో కలిసి జేసీ గోపాలకృష్ణతో సమావేశమయ్యారు. ముందుగా కొత్తపట్నం మండలం అల్లూరు పరిసర ప్రాంతాల్లో గతంలో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం పరిశీలించిన భూమిపై చర్చించారు. వాటి మ్యాప్లతోపాటు గతంలో తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడారు. అనంతరం విలేకరులతో ఎంపీ మాగుంట మాట్లాడుతూ 2004లో తాను ఒంగోలుకు ఎయిర్పోర్టు అవసరాన్ని గుర్తించి, అందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అప్పటికి ముఖ్యమంత్రి 2006లో ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపారని వివరించారు. 730 ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. ప్రస్తుతం వాణిజ్యపరంగా ఒంగోలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఎయిర్పోర్టు నిర్మాణం ఎంతో అవసరంగా ఉందన్నారు. ప్రతిపాదిత భూమి ఒంగోలుకు ఆరుకిలోమీటర్ల దూరంలోనే ఉందని చెప్పారు. వాన్పిక్ భూముల్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి అప్పుడు అంగీకారం తెలిపిందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల్లో ఎయిర్పోర్టుల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించారన్నారు. పాత జిల్లాల్లో ఎక్కడైతే మంజూరై పెండింగ్లో ఉన్నాయో వాటి నిర్మాణానికి పౌరవిమానయాన మంత్రి అంగీకారం తెలిపారన్నారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడులు ఇటీవల రాష్ట్రంలో ఏడు ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు ప్రకటించగా అందులో ఒంగోలు కూడా ఉందన్నారు. అందుకు అవసరమైన భూసేకరణపై జేసీతో చర్చించామని తెలిపారు. గతంలో వాన్పిక్ కోసం ఆరువేలకుపైగా ఎకరాల భూసేకరణ చేశారన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి 730 ఎకరాలకు గాను 600 ఎకరాలు వాన్పిక్లోనే ఉందని, అప్పట్లో ఆ సంస్థ ఒప్పుకున్నందున ఎయిర్పోర్టు నిర్మాణానికి ఎలాంటి అవరోధాలు లేవని చెప్పారు. మిగిలిన భూమిని మాత్రమే సేకరించాల్సి ఉందన్నారు. త్వరలో ఈ విషయంపై సీఎంను కలిసి వివరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, డీఆర్వో విశ్వేశ్వరరావు, ఆర్డీఓ సుబ్బారెడ్డి, కొత్తపట్నం తహసీల్దార్ మధుసూదన్రావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa