విజయవాడ ఊహించని విపత్తులో చిక్కుకుంది.. ఎటు చూసినా వరదే, పెద్ద పెద్ద భవనాలు నీటమునిగాయి. ఈ కష్ట సమయంలో రాష్ట్రం మొత్తం ఒక్కటయ్యింది.. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు. ఆహారం, వాటర్ బాటిల్స్, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, కూరగాయలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది గొప్ప మనసును చాటుకుంటున్నారు. విజయవాడలో వరద బాధితుల కోసం ఓ రైతు కూడా.. స్వచ్ఛందంగా తనవంతుగా సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రైతు శ్రీనివాసరావుకు డ్రోన్ ఉంది.. దాని సాయంతో తన పొలంలో మందులు పిచికారి చేస్తుంటారు. అయితే విజయవాడలో పరిస్థితులు చూసి చలించిపోయారు.. వరద బాధితులకు తన వంతుగా సాయం అందించాలని భావించారు. అక్కడ నిత్యావసరాల కోసం వరద బాధితులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని సాయం చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు. ఆలోచన రాగానే.. తన డ్రోన్ తీసుకొని బైక్ మీద భీమవరం నుంచి బయల్దేరి నేరుగా విజయవాడ వచ్చారు. వెంటనే రంగంలోకి దిగి.. జక్కంపూడి, వాంబే కాలనీ ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి డ్రోన్తో పాలు, బిస్కెట్లు, ఆహార పదార్థాలను బాధితులకు చేరవేస్తున్నారు. రైతు శ్రీనివాసరావుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. తోటి మనిషి కష్టంలో ఉంటే స్పందించిన తీరుకు హ్యాట్సాఫ్ అంటున్నారు.
మరోవైపు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రశంసలు వస్తున్నాయి. ఆకలితో అలమటిస్తున్నవారికి డ్రోన్ల సాయంతో ఆహారాన్ని, మందుల్ని, ఇతర సామాగ్రిని అందేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచనను ఆచరణలో పెట్టింది.. తొలిసారి డ్రోన్లతో ఆహారాన్ని అందించేలా ప్రయోగం చేసింది. డ్రోన్ల సాయంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ప్రస్తుతం 30 డ్రోన్లతో సాయం అందిస్తున్నారు.. మరో 200 డ్రోన్లను సమకూర్చుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక్కో డ్రోన్ ద్వారా 8-10 కిలోల సామగ్రిని పంపే అవకాశం ఉంటుంది. డ్రోన్కు తాడుతో ఓ బుట్టను కట్టి.. అందులో ఆహార పదార్థాలను వరద బాధితుల కోసం పంపారు. ఈ డ్రోన్లు నాలుగు కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలుగుతాయి.. దారిలో విద్యుత్ తీగలు, నిర్మాణాలు అడ్డుతగిలితే తప్పుకొనేందుకు వీలుగా.. ఈ డ్రోన్లకు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఈ డ్రోన్లకు ఉన్న బ్యాటరీ 20 నిమిషాలు పనిచేస్తుంది. వరద బాధితులకు ఆహారాన్ని అందించగానే హోమ్ బటన్ నొక్కితే నేరుగా వెనక్కు వచ్చేస్తుంది.
విజయవాడలోని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లోకి పడవలు వెళ్లలేని పరిస్థితి. అజిత్సింగ్ నగర్, వాంబే కాలనీ, అరుణోదయ నగర్, జక్కంపూడి కాలనీ పరిధిలో ఉన్న అనేక వీధుల్లో వేలమందికి ఆకలి బాధలు తప్పలేదు. వాళ్లందరికి హెలికాప్టర్లతో ఆహారం పంపాలన్నా.. చుట్టూ ఉన్న విద్యుత్ తీగల కారణంగా సాధ్యం కాలేదు. వెంటనే ప్రభుత్వానికి ఈ సరికొత్త ఆలోచన వచ్చింది.. 30 డ్రోన్లను వినియోగించింది. భవనాలు, అపార్టుమెంట్ల పైభాగంలో ఉన్న బాధితులకూ డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను అందించారు. డ్రోన్ల సాయంతో గత రెండు రోజుల్లో సుమారు 10వేల మందికి ఆహారం అందించారు. విజయవాడలో ఎవరైనా లొకేషన్ షేర్ చేస్తే డ్రోన్లు ఆ ప్రాంతానికి వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నారు. విపత్తుల నిర్వహణ సంస్థకు అందిన మెసేజ్లు, వారికి వచ్చిన ఫోన్ నంబర్లు, సమాచారం ఆధారంగా బాధితుల లొకేషన్ గుర్తించి వారి అవసరాల మేరకు ఆహారం, మందులు, వాటర్ బాటిల్స్ పంపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa